ప్రణబ్‌ కుమార్తె భావోద్వేగ ట్వీట్‌

31 Aug, 2020 19:21 IST|Sakshi

దేశ సేవలో తరించారు : శర్మిష్ట ముఖర్జీ

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశం విషాదంలో మునిగిపోయింది. ప్రణబ్‌ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ భావోద్వేగంతో ట్వీట్‌ చేశారు. అందరికీ వందనం అంటూ ట్వీట్‌ను ప్రారంభించిన శర్మిష్ట ‘నాన్నా..అందరికీ మీ తుది వీడ్కోలు పలికేందుకు మీ అభిమాన కవి కోట్‌ను ఉదహరించే స్వేచ్ఛ తీసుకుంటున్నాను..దేశ సేవలో, ప్రజా సేవలో మీరు పూర్తిగా, అర్ధవంతమైన జీవితం గడిపారు..మీ కుమార్తెగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తా’ అని వ్యాఖ్యానించారు.

ఇక ఆర్మీ రిఫరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.  కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఆరోగ్యం విషమించి మరణించారని ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రణబ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చదవండి : రాష్ట్రపతి భవన్‌ను సామాన్యులకు చేరువ చేశారు : మోదీ

మరిన్ని వార్తలు