పాక్‌పై ప్రశంసలు : ఎంపీపై విమర్శలు

18 Oct, 2020 15:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశిథరూర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. కరోనా నియంత్రణ విషయంలో  భారత్‌ కంటే పాకిస్తాన్‌ ప్రభుత్వం మెరుగైన చర్యలను చేపట్టిందని అన్నారు. ప్రాణాంతక కోవిడ్‌పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి నుంచీ నిర్లక్ష్యంగా వ్యహరించారని విమర్శించారు. ప్రధాని వ్యవహరించిన తీరు సరైనది కాదని, ఆయన చర్యల కారణంగా దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని మండిపడ్డారు. కరోనాపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తొలినుంచి హెచ్చరిస్తూనే ఉన్నారని, ఆయన మాటలను వినిఉంటే ఈ రోజు దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని థరూర్‌ అభిప్రాయపడ్డారు. వైరస్‌ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని పేర్కొన్నారు. (ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలబుల్‌’)

కరోనాను అరికట్టడంలో భారత ప్రభుత్వం కంటే పాకిస్తాన్‌ ఎంతో పరిణితితో వ్యవహరించిందని చెప్పారు. ఈ మేరకు శనివారం ఆల్‌లైన్‌ ద్వారా నిర్వహించిన లాహోర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంలో శశిథరూర్ ప్రసంగించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వంలో దేశంలోని ముస్లింలకు అభద్రతా భావానికి లోనవుతున్నారని విమర్శించార. కాగా కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉంటూ పాకిస్తాన్‌ను ప్రశంసించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సరిహద్దుల్లో భారత జవాన్లపై కాల్పులకు తెగబతున్న శత్రుదేశానికి మద్దతు తెలపడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‌ దేశ ప్రజలకు, ప్రధాని మోదీకి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు