ఎయిర్‌పోర్ట్‌ వివాదం.. కేరళ మంత్రికి శశి థరూర్‌ రిప్లై

22 Aug, 2020 18:13 IST|Sakshi

తిరువనంతపురం : తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటుకు అప్పజెప్పాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మద్దతు ఇవ్వడం కేరళలో వివాదంగా మారింది.  తిరువనంతపురం విమానాశ్రయాన్ని 50 సంవత్సరాలపాటు ప్రైవేటు సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇదే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం మేజర్ భాగస్వామిగా ఉండేలా స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఏర్పాటు చేయాలని చేసిన పలు విజ్ఞప్తుల్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభ్యంతరం తెలుపుతూ.. స్పెషల్ పర్పస్ వెహికల్గా ఈ ప్రాజెక్టుకుని పరిగణలో తీసుకున్నప్పుడు ఈ భూమి విలువను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పరిగణించాల్సి వస్తుందన్నారు. ఈ మేరకు ఈ విషయంపై ప్రదానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.‌ (కేరళ సర్కార్‌పై కాంగ్రెస్‌ అవిశ్వాసం)

ఈ క్రమంలో సంపదను కూడబెట్టుకునేందుకు ప్రైవేటు కార్పొరేట్లు చేస్తున్న ప్రయత్నానికి శశి థరూర్‌ ఎందుకు మద్దతిస్తున్నారని కేరళ ఆర్థిక మంత్రి  థామస్‌ ఇస్సాక్‌ ప్రశ్నించారు. కేరళ ప్రభుత్వ ఆధీనంలో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం విజయవంతంగా నడుస్తున్నప్పడు శశి థరూర్‌ దాన్ని ఎందుకు అదానీకి చెందాలని భావిస్తున్నాడని ప్రశ్నించారు. కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన శశి థరూర్‌ ముంబై, ఢిల్లీ వంటి ఎయిర్‌పోర్టులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడం వల్ల ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఎలా వేలాది కోట్ల రూపాయలు ఆర్జిస్తుందో ఉదాహరించారు.  విమానాశ్రయం ప్రైవేటు సంస్థకు లీజుకు ఇవ్వడం కేవలం ఆదాయం కోసం కాదని.. విమనాశ్రయ సామర్ధ్యాన్ని పెంచేందుకు అని స్పష్టం చేశారు. (అందుకే అదానీకి ఇచ్చాం : కేంద్రమంత్రి వివరణ)

గత ఏడాది ఫిబ్రవరిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ విజయవంతంగా ఆరు విమానాశ్రయాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. అహ్మదాబాద్, మంగుళూరు, లక్నో ఈ మూడింటిని అహ్మదాబాద్‌కు చెందిన కంపెనీకి లీజుకు ఇచ్చే ప్రతిపాదనను 2019 జూలైలో కేంద్రం ఆమోదించింది. మిగిలిన మూడింటిని - తిరువనంతపురం, జైపూర్, గౌహతిలను ఆగస్టు 19 న ఆమోదించింది.

మరిన్ని వార్తలు