కోట్లలో ఊర్మిళ కార్యాలయం ఖరీదు

4 Jan, 2021 14:52 IST|Sakshi

సాక్షి, ముంబై : శివసేనలో ఇటీవలే ప్రవేశించిన బాలీవుడ్‌ నటి ఊర్మిళా మాతోండ్కర్‌ రాజకీయాల్లో రెండో ఇన్నింగ్‌ కోసం ముంబైలో రూ. 3.75 కోట్లు విలువజేసే కార్యాలయాన్ని కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో చేరి రాజకీయాల్లో రంగప్రవేశం చేసిన ఆమె, లోకసభ ఎన్నికల్లో పరాజయం అనంతరం కాంగ్రెస్‌లోని అంతర్గత కుమ్ములాటల కారణంగా పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే శివసేనలో చేరిన ఆమెకు మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం గవర్నర్‌ కోటాలోని ఎమ్మెల్సీ పదవి కోసం సిఫారసు చేసింది.

ఇలా శివసేనలో చేరి రాజకీయాల్లో రెండో ఇన్నింగ్‌ ప్రారంభించిన ఊర్మిళా అత్యంత ఖరీదైన కార్యాలయాన్ని ముంబైలోని ఖారులో కొనుగోలు చేశారు. పశ్చిమ ఖార్‌ లింకింగ్‌ రోడ్డుపై 6వ అంతస్తులో 96.61 చదరపు మీటర్లు (1039.901 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఉన్న కార్యాలయం కోసం ఆమె రూ. 3.75 కోట్లు వెచ్చించారు. ఒక్కో చదరపు అడుగుకి సుమారు రూ. 36 వేల ధరతో కొనుగోలు చేయడం విశేషం. అయితే భవనం కొనుగోలు చేయడానికి రాజకీయాలు లేదా శివసేనలో చేరడానికి ఎలాంటి సంబంధం లేదని ఊర్మిళ చెబుతున్నారు. 
 

మరిన్ని వార్తలు