ఆమె పులిలా పోరాడింది

2 Apr, 2021 05:17 IST|Sakshi

బెంగాల్‌లో మమత గెలుపు ఖాయం 

శివసేన ఎంపీ సంజయ్‌ రావుత్‌ 

ముంబై: పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ పులిలా పోరాడిందని, ఆమె విజేతగా అవతరించడం ఖాయమని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. గురువారం ముంబైలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పుడు జరగబోయే కేరళ, తమిళనాడు, అస్సాం, బెంగాల్‌ (నాలుగు రాష్ట్రాల) ఎన్నికలు జాతీయ రాజకీయాలను నిర్ణయిస్తాయని ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా అస్సాం, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని అన్నారు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉందని, అయితే కాంగ్రెస్‌ గట్టిగా పోరాటం చేసిందని ప్రశంసించారు.

మమతా బెనర్జీ లేఖపై మీడియా ప్రశ్నించినపుడు సీఎం ఉద్ధవ్‌కు కూడా లేఖ వచ్చిందని, ఎన్నికల తర్వాత పొత్తులపై చర్చించే అవకాశం ఉందన్నారు. ఇక పశ్చిమబెంగాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు నిజమైన మహాభారతం కంటే భయంకరంగా ఉన్నాయని రౌత్‌ ఆందోళన వ్యక్తంచేశారు. బెంగాల్‌ ఎన్నికలను దేశం మొత్తం పరిశీలిస్తోందని, ప్రజలు కూడా తెలివైనవారేనని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల సంజయ్‌పై బాలాసాహెబ్‌ థోరాట్‌ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. యూపీఏ నాయకత్వాన్ని సోనియా నుంచి శరద్‌ పవార్‌కు అప్పగించాలని అనలేదని, కేవలం యూపీఏను గాడిలో పెట్టాలనే వ్యాఖ్యానించానని ఎంపీ స్పష్టంచేశారు.  

మరిన్ని వార్తలు