సంజయ్‌ రౌత్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ.. ఆ వినతికి కోర్టు నో!

8 Aug, 2022 14:50 IST|Sakshi

ముంబై: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు 14 రోజుల జ‍్యుడీషియల్‌ కస్టడీ విధించింది ముంబైలోని ప్రత్యేక కోర్టు. ముంబైలోని పత్రచల్‌ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రౌత్‌. ఈడీ కస్టడీ ముగియడంతో సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది న్యాయస్థానం. దీంతో ఆయన జైలులో గడపనున్నారు. తనకు ఇంటి నుంచే ఆహారం, ఔషధాలు తీసుకురావాలని సంజయ్‌ రౌత్‌ కోరగా.. అందుకు అంగీకరించింది కోర్టు. కానీ, ప్రత్యేక పడక ఏర్పాటును తిరస్కరించింది. 

పత్రచల్‌ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో ఆగస్టు 1వ తేదీన సంజయ్‌ రౌత్‌ను అరెస్ట్‌ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియటంతో ప్రత్యేక పీఎంఎల్‌ఏ జడ్జీ ఎంజీ దేశ్‌పాండే ముందు హాజరుపరిచింది. అయితే.. తమ కస్టడీని పొడిగించాలని ఈడీ కొరలేదు. దీంతో జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది కోర్టు.

ఇదీ చదవండి: ఎస్పీ నేత కారును ఢీకొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు