పెగాసస్‌ మీ బుర్రలో ఉంది! ఫోన్‌లో కాదు! రాహుల్‌కు మధ్యప్రదేశ్‌ సీఎం చురకలు

5 Mar, 2023 11:12 IST|Sakshi

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో చేసిన ఉపన్యాసం.. రాజకీయ విమర్శలకు దారి తీసింది. బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసుకునే ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాహుల్‌కి కౌంటరిచ్చారు.

పెగాసస్‌ అనేది రాహుల్‌ గాంధీ ఫోన్‌లో లేదని, ఆయన మైండ్‌లోనే  ఉందని ఎద్దేవా చేశారు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌. ‘‘పెగాసస్‌ అనేది కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోకి ప్రవేశించింది. రాహుల్‌ తెలివితేటలు చూసి జాలిపడుతున్నా. ఆయన విదేశాలకు వెళ్తాడు. దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి వచ్చేస్తాడు. విదేశీ రాయబార కార్యాలయాలకు వెళ్లి భారత్‌కి వ్యతిరేకంగా మాట్లాడి.. దేశ పరువు తీయడమేనా? కాంగ్రెస్‌ ఎజెండా అంటూ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మండిపడ్డారు. విదేశాల్లో దేశాన్ని విమర్శించడం దేశ వ్యతిరేక చర్య. దేశం గానీ, ప్రజలు గానీ మిమ్మల్ని(రాహుల్‌ను ఉద్దేశించి) ఎప్పటికీ క్షమించరు. 

కాగా, ఇటీవల రాహుల్‌ గాంధీ కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ..ఇజ్రాయిల్‌ స్పైవేర్‌ అయిన పెగాసన్‌ గురించి ప్రస్తావించారు. ఈ పెగాసస్‌ ద్వారా తన ఫోన్‌ గూఢచర్యం జరుగుతోందని, కాల్స్‌ మాట్లాడటం గురించి జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్‌ అధికారులు తనను హెచ్చరించాయని చెప్పారు. పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకుల ఫోన్‌లో పెగాసస్‌ ఉందని వ్యాఖ్యలు చేశారు. అలాగే తనపై తప్పుడూ అభియోగాలు మోపి కేసులు పెట్టారన్నారు. అలాగే కేంద్రం ఇంటెలిజెన్సినీ దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలపై కేసులు పెడుతోందన్నారు. ప్రజాస్వామ్య నిర్మిత దేశంలో ఇలాంటి చర్యలు సరికాదని, తాను అందుకోసమే పోరాడుతున్నాని చెప్పుకొచ్చారు రాహుల్‌.

మరిన్ని వార్తలు