Video: ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

19 Aug, 2022 17:08 IST|Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని బోరివాలి ప్రాంతంలో శుక్ర‌వారం నాలుగంత‌స్తుల‌ భ‌వ‌నం కుప్ప‌కూలింది. సాయిబాబా న‌గ‌ర్‌లో గీతాంజ‌లి బిల్డింగ్ మ‌ధ్నాహ్నం 12.34 గంట‌ల ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోయింది. భవనం కూలుతున్న సమయంలో భారీ శబ్ధాలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. భవనం అకస్మాత్తుగా కూలుతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

అయితే ఈ ఘ‌ట‌న‌లో ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి గాయాలు, ప్రాణ‌న‌ష్టం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇప్పటికే అందులోని నివాసితులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారో లేదో పరిశీలిస్తున్నారు.  సహాయ చర్యల కోసం ఇప్పటికే ఎనిమిది ఫైర్ ఇంజన్లు, రెండు రెస్క్యూ వ్యాన్‌లు, మూడు అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి.
చదవండి: ఆ చిలుకలు ఇక చాలు.. జూకి ఇచ్చేస్తాం: అర్జున్, రంజన

మరిన్ని వార్తలు