ఖైదీల ఘర్షణ.. సిద్దు హత్య కేసులో ఇద్దరు నిందితుల హతం

26 Feb, 2023 18:27 IST|Sakshi

ఛండీగఢ్‌: సింగర్‌ సిద్దూ మూసేవాలా హత్య కేసు నిందితుల్లో ఇద్దరు.. జైలు ఘర్షణలో హతమయ్యారు. పంజాబ్‌ టార్న్ తరణ్ జిల్లా గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలు ఆదివారం ఐదుగురు ఖైదీల మధ్య జరిగింది. ఈ ఘర్షణలో మన్‌దీప్‌ సింగ్‌ అలియాస్‌ తుపాన్‌ ఆఫ్‌ బటాలా, మన్మోహన్‌సింగ్‌ అలియాస్‌ మోహ్న ఆఫ్‌ బుద్లానాలు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. 

మరో ఖైదీ  కేశవ్‌ ఆఫ్‌ బతిండాకు గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురు ఒకే గ్యాంగ్‌కు చెందిన వాళ్లని, సిద్దు హత్యకేసులో నిందితులుగా ఉన్నారని ఎస్‌ఎస్పీ గుర్మిత్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. తుపాన్‌ మూసేవాలా హత్య కేసులో షూటర్లకు వాహనాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఇక పంజాబీ యువగాయకుడు సిద్దూ మూసేవాలా.. 2022, మే 29న కాల్పుల్లో హత్యకు గురయ్యాడు. అంతకు ముందురోజే ఆయనకున్న సెక్యూరిటీని పంజాబ్‌లో కొలువు దీరిన మాన్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిపారు ఆయనపై దుండగులు.

మరిన్ని వార్తలు