Singer Sidhu Moose Wala Murder Case: సిద్ధూతో సెల్ఫీ దిగింది ఎవరు? సీసీ ఫుటేజ్‌ బయటకు..

6 Jun, 2022 16:25 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్‌ ప్రకారం చేసిన ప్రతికార హత్య అని దర్యాప్తులో తేలింది. అదీగాక అనుమానితుడు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ కూడా తన అన్నని మట్టుపెట్టినందుకు ప్రతీకారంగానే సిద్ధూని తన ముఠా సభ్యులు చంపినట్టు ఒప్పుకున్నాడు. ఈ తరుణంలో సిద్ధు హత్య జరిగిన రోజుకు సంబంధించిన సీసీఫుటేజ్‌ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

ఆ ఫుటేజ్‌లో సిద్ధూ ఎస్‌యూవీ కారుకి సమీపంలో ఇద్దరూ వ్యక్తులు నిలుచుని ఉన్నారు. ఇద్దరిలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం సిద్ధూ వద్దకు వస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ వ్యక్తి డ్రైవర్‌ వైపుగా వచ్చి సిద్ధూతో సెల్ఫీ తీసుకున్నాడు. ఐతే ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకున్న తర్వాతే.. సిద్ధూ పై జరిగింది. ఆ సమయంలోనే ‘దాడి చేయడానికి సిద్ధంకండి’ అంటూ షూటర్లకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు.

కానీ ఆ సీసీ ఫుటేజ్‌లో ఆ వ్యక్తుల ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా పరిగణిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి.. ఈ సెల్ఫీనే కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సిద్ధూని హతమార్చిన ఎనిమిది మంది షూటర్లను పంజాబ్ పోలీసులు గుర్తించారు. ఆ షూటర్లంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రాలకు చెందినవారు. నిందితుల ఆచూకి కోసం ఈ మూడు రాష్ట్రాల్లోనూ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 

(చదవండి: యస్‌.. ఇది ప్రతీకార హత్యే!: సింగర్‌ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు)

మరిన్ని వార్తలు