సీరం, కేంద్రం డీల్‌ : రూ. 200కే వ్యాక్సిన్‌

11 Jan, 2021 17:31 IST|Sakshi

200 రూపాయల తక్కువ ధరకే కోవీషీల్డ్‌

కేంద్రం, సీరం మధ్య  డీల్‌

మొదటి విడతగా కోటి  పదిలక్షల టీకాల సరఫరా

సాక్షి, న్యూఢిల్లీ: జనవరి 16వ తేదీనుంచి కరోనా వైరస్‌ మహమ్మారికి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ షురూ కానున్న నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలకు దిగింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్‌ టీకా డోసుల కొనుగోలు, అందుబాటులో ధరలో టీకాను అందించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం డీల్‌కు సిద్ధపడుతోంది.

కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి  చేస్తున్న పుణేకు చెందిన అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో  కేంద్రం ఒప్పందం కుదుర్చుకోనుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ ధరపై ప్రభుత్వంతో  ఒప్పందం కుదిరిందని సీరం తాజాగా ధృవీకరించినట్టు స​మాచారం.ఈ డీల్‌ తరువాత  వ్యాక్సిన్‌ ధర 200  రూపాయలుగా  ఉంటుందని సీరం వర్గాలు ప్రకటించాయి.  ప్రారంభ దశలో  తొలి 100 మిలియన్  (కోటి ) మోతాదులను 200 రూపాయలకే అందించనున్నామని వెల్లడించాయి.  మొత్తం 11 మిలియన్ల టీకాలను అందిస్తామన్నారు. అంతేకాదు ఈ  రాత్రి​కి(సోమవారం) లేదా రేపు ఉదయానికి టీకాల రవాణా మొదలవుతుందని  స్పష్టం చేశాయి. దీనిపై అధికారిక ప్రకటేన రావాల్సి ఉంది.

కాగా కోవిషీల్డ్‌తో పాటు భారత్‌ బయోటెక్‌  రూపొందిస్తున్న కోవాగ్జిన్‌ టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఇటీవల అనుమతులు మంజూరు చేసింది.  జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు గతవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలి ప్రాధాన్యం కింద 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా అందించనున్నారు. ఆ తర్వాత 50ఏళ్లు పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే 50ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. జులై నాటికి 30కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మ‌రోవైపు  వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అమలు, కోవిన్‌యాప్‌ తదితర అంశాలపై  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం చర్చిస్తున్నారు. దాదాపు ప్రతీ జిల్లాలోనూ  కరోనా వ్యాక్సిన్‌  డ్రైవ్‌ రన్ ‌పూర్తి చేశామని ప్రధాని వెల్లడించారు. 

చదవండి:
వ్యాక్సిన్‌పై సాధారణ సందేహాలు!

టీకా పంపిణీలో ‘కోవిన్‌’ కీలకం

మరిన్ని వార్తలు