అబ్బాయి ఒడిలో అమ్మాయిలు: వార్తల్లోకెక్కిన శ్రీకార్యం బస్టాండ్‌.. కూల్చేసిన ప్రభుత్వం

17 Sep, 2022 10:39 IST|Sakshi

తిరువనంతపురం: ఏమాత్రం సిగ్గుపడకుండా అబ్బాయి వడిలో అమ్మాయిలు కూర్చుని ఆ మధ్య సోషల్‌ మీడియాలో ఫొటోలు తెగ వైరల్‌ అయ్యాయి. స్థానికులు ఓ బస్టాండ్‌లో చేసిన పనితో.. మండిపోయిన కాలేజీ స్టూడెంట్స్‌ ఈ ట్రెండ్‌ను పుట్టించారు.  అయితే వార్తల్లో చర్చనీయాంశంగా మారిన ఆ బస్టాండ్‌ను.. రెండు నెలల తర్వాత ఇప్పుడు కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు.

అమ్మాయిలు, అబ్బాయిలు పక్కపక్కనే కూర్చుంటున్నారంటూ తిరువనంతపురం శ్రీకార్యం బస్టాండ్‌ బెంచ్‌ను మూడు ముక్కలు చేశారు స్థానికులు. ఇది నచ్చని కొందరు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు.. ఆ మూడు ముక్కలపై ఒళ్లో కూర్చుని ఫొటోలు పెట్టి వైరల్‌ చేశారు. అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చున్న ఫొటోలు తెగ ట్రెండ్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఆ బస్‌ షెల్టర్‌ను తాత్కాలికంగా సీజ్‌ చేశారు పోలీసులు.  జులైలో ఈ ఘటన జరిగింది.


అయితే ఈ విషయం ప్రభుత్వం దాకా వెళ్లడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ బస్టాండ్‌ను పడగొట్టాలని నిర్ణయించడంతో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ స్థానంలో కొత్త బస్టాండ్‌ను, అదీ లింగ వివక్షకు తావు లేకుండా ఉండేలా చూస్తామని విద్యార్థులకు మాటిచ్చారు మేయర్‌ ఆర్య రాజేంద్రన్‌. స్థానికులు చేసిన ఆ పని అనవసరమైందని, ప్రొగ్రెసివ్‌ స్టేట్‌గా పేరున్న కేరళలలో ఇలాంటి ఘటనలు జరగడం మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. అలాగే.. అబ్బాయిలు-అమ్మాయిలు కలిసి కూర్చోవడంపై రాష్ట్రంలో ఎలాంటి నిషేధం లేదన్న ఆమె.. అలా కనిపించిన వాళ్లను వేధించే సంస్కృతి ఏనాడో అంతరించిపోయిందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: వాళ్లు చదువుకునేలా ఏదైనా సాయం చేయండి

మరిన్ని వార్తలు