అమరావతి నదిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి 

18 Jan, 2022 14:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మరో ఇద్దరి పరిస్థితి విషమం 

సాక్షి, చెన్నై : అమరావతి నదిలో స్నానానికి వెళ్లిన ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తారాపురం ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. వివరాలు.. తిరుప్పూర్‌ నగరం పరిధి లోని మంగళం ఇడుంబి ప్రాంతానికి చెందిన 13 మందితో కూడిన బృందం దిండుగల్‌ మాంపారైకు వెళ్లి.. సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో మధ్యాహ్నం వేళ అమరావతి నదిలో స్నానానికి ఈ బృందం సిద్ధమైంది. తారాపురం పరిసరాల్లో అమరావతి నదిలో స్నానానికి నిషేధం విధిస్తూ బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నా, వాటిని వీరు పట్టించుకోలేదు.

చదవండి: Jallikattu: రంకేసిన.. పౌరుషం.. బుసకొట్టిన బసవన్న.. కార్తీక్‌కు కారు గిఫ్ట్‌

 బైపాస్‌ రోడ్డును ఆనుకుని ప్రవహిస్తున్న నదిలో 8 మంది స్నానానికి దిగారు. హఠాత్తుగా బురదలో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత మరొకరు నీట మునగడాన్ని ఒడ్డు నుంచి చూసిన మిగిలిన వారు కేకలు పెట్టడంతో స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. అయితే నది లో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో రక్షించడం కష్టతరంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. సాయంత్రం ఆరు గురి మృతదేహాలను గుర్తించారు.

ఇద్దరు కొన ఊపిరితో బురదలో కూరుకుపోయి ఉండడంతో వారిని తారాపురం ఆస్పత్రికి తరలించారు. ఇక మృతి చెందిన వారిలో ఇడంబి ప్రాంతానికి చెందిన మోహన్, రంజిత్, శ్రీధర్, యువన్, అమీర్, చక్రవర్తి ఉన్నారు. వీరి మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు