శివకాశిలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

25 Feb, 2021 20:02 IST|Sakshi

చెన్నై : తమిళనాడులోని శివకాశిలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా దాదాపు 14 మందికి గాయాలయ్యాయి. విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని కాళైయ్యర్‌కురిచ్చిలో ఓ ప్రైవేటు బాణాసంచా తయారీ పరిశ్రమలో ఫ్యాన్సీ రకానికి చెందిన టపాసులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం భారీ స్థాయిలో ప్రమాదం సంభవించి పది గదులు నేలమట్టమయ్యాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కూలీలు మృత్యువాతపడగా.. 14 మందికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. శరీరాలు బాగా కాలిపోవడంతో మృతులను వెంటనే  గుర్తించడం సాధ్యం కాలేదు. వరుసగా పేలుళ్లు చోటుచేసుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శివకాశి పరిసర ప్రాంతాల్లో గత రెండు వారాల్లో మూడు పేలుడు ఘటనలు జరిగాయి. ఈ నెల 12న అచ్చంకుళంలోని ఓ బాణ సంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బాణసంచా పరిశ్రమల క్రమబద్ధీకరణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందించాలని మధురై  హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఈ రోజు మధ్యాహ్నమే ఆదేశించింది. 

చదవండి: 
బంజారాహిల్స్‌లో బీఎండబ్ల్యూతో ఉడాయించిన డ్రైవర్‌

సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను!

>
మరిన్ని వార్తలు