ఒకే ఇంట్లో ఆరు డెడ్‌బాడీల కలకలం.. ఏం జరిగింది?

17 Aug, 2022 10:37 IST|Sakshi

ఒకే ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులు మృతిచెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో బుధవారం ఉదయం ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది మృతిచెందడాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

కాగా, మృతులను సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా బనో, నసీమా అక్తర్, కుమారుడు జాఫర్​ సలీం, మరో ఇద్దరు బంధువులు నూర్​ ఉల్​ హబీబ్​, సాజిద్​ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, వీరు ఎలా చనిపోయారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు. 

ఇదిలా ఉండగా.. మంగ‌ళ‌వారం ఉగ్ర‌వాదులు సోఫియాన్ జిల్లాలో క‌శ్మీర్ పండిట్ల‌పై కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఆ కాల్పుల్లో ఓ క‌శ్మీర్ పండిట్ చ‌నిపోగా, అత‌ని సోద‌రుడు గాయ‌ప‌డ్డాడు. మృతున్ని సునీల్ కుమార్ భ‌ట్‌గా గుర్తించారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇది కూడా చదవండి: రోడ్డు లేక డోలీలో ఆస‍్పత్రికి బాలింత.. కవలలు కన్నుమూత!

మరిన్ని వార్తలు