ఎన్నికల ప్రచార సభలో తేజస్వీకి చేదు అనుభవం

21 Oct, 2020 09:41 IST|Sakshi

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్ని జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సభలు, సమావేశాలతో నాయకులు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆగంతకులు ఆయన మీదకు చెప్పులు విసిరారు. వివరాలు.. ఔరంగాబాద్‌ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ప్రచారం కోసం వచ్చారు తేజస్వీ. సభా వేదికపై కూర్చుని ఉండగా.. ఆకస్మాత్తుగా ఆయన వైపు రెండు చెప్పులు వచ్చి పడ్డాయి. వాటిలో ఒకటి ఆయన తల పక్క నుంచి వెళ్లి పోగా.. మరోకటి మాత్రం తేజస్వీకి తగిలి ఆయన ఒడిలో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే తేజస్వీపైకి చెప్పులు ఎవరు విసిరారో.. ఎందుకు వేశారో మాత్రం తెలియలేదు. (చదవండి: హవ్వా! మస్కా కొట్టకు మంత్రీజీ)

ఈ ఘటన అనంతరం తన ప్రసంగం మొదలు పెట్టిన తేజస్వీ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే ఈ ఘటనను ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యంజయ్‌ తివారీ ఖండించారు. ఎన్నికల ప్రచార సమయంలో నేతలకు సరైన భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆర్జేడీ కూటమి తలపడుతుంది. మొత్తం 243 స్థానాలకు గాను 144 చోట్ల ఆర్జేడీ తన అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. 

>
మరిన్ని వార్తలు