బడ్జెట్ 2021: స్మార్ట్‌ఫోన్లపై జీఎస్టీని తగ్గించండి

31 Jan, 2021 16:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మందగించిన ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఊతం ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. కేంద్రం కూడా అన్ని బడ్జెట్ల కంటే ఇది ప్రత్యేకమని పేర్కొంది. అన్ని రంగాలు కూడా ఈ బడ్జెట్ పై అనేక ఆశలు పెట్టుకున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ రంగం కూడా ప్రభుత్వ విధానాలలో పెద్ద మార్పులు తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తోంది. ఈ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెరుగుతాయని స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఆశిస్తున్నారు. (చదవండి: బడ్జెట్‌ 2021–22.. ఫోకస్)

గతంలో "మేకిన్ ఇండియా" ఉత్పత్తులను ప్రోత్సహించాలనే నేపథ్యంలో దిగుమతిని నిరుత్సాహపరిచేందుకు సెల్యులార్ హ్యాండ్‌సెట్‌లపై కస్టమ్స్ సుంకాన్ని 20%కి పెంచారు. అయితే, ఇండస్ట్రీ బాడీ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసిఇఎ) మొబైల్ పరిశ్రమపై విధించిన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టి)ను తగ్గించాలనే డిమాండ్‌ను మళ్లీ కేంద్రం ముందుకు తీసుకొచ్చింది. గత ఏడాది మార్చిలో మొబైల్ పరిశ్రమపై 50శాతం పన్నును అధికంగా విధించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు పేర్కొంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతికి కోసం మరింత ప్రోత్సాహం ఇస్తుందని వారు భావిస్తున్నారు. 

ప్రతి భారతీయుడికి స్మార్ట్‌ఫోన్‌ అందించాలంటే మొబైల్ ఫోన్‌లపై విధించిన జీఎస్‌టిని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించడం అత్యవసరం అని ఐసీఇఎ చైర్మన్ పంకజ్ మొహింద్రూ ఒక ప్రకటనలో చెప్పారు. ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కోసం రూ.500 కోట్లు, మొబైల్ డిజైన్ సెంటర్‌కు రూ.200 కోట్లు బడ్జెట్ లో కేటాయించాలని ఐసీఇఎ కేంద్రానికి సిఫారసు చేసింది. మరోవైపు మొబైల్ ఫోన్, కాంపోనెంట్ తయారీదారులు ఎగుమతి ప్రోత్సాహకాలు అందించడంతో పాటు మొబైల్ భాగాలపై తక్కువ జీఎస్టీని విధించాలని కోరుకుంటున్నారు. "సబ్ $200 ఎంట్రీ లెవల్(రూ.15,000) మొబైల్ ఫోన్ విభాగంలో స్వదేశీ హ్యాండ్‌సెట్ తయారీదారులు ప్రపంచంలో అగ్రశ్రేణిలో ఉండటానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది" అని ఐసీఇఎ తెలిపింది.

మరిన్ని వార్తలు