సోనాలి ఫోగట్‌ను ఎవరు చంపారో తేల్చాలి.. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ కేసులా కావొద్దు

27 Aug, 2022 16:56 IST|Sakshi

చండీగఢ్‌: హర్యానా బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినా ఆమె మరణానికి గల కారణాలపై మిస్టరీ వీడటం లేదు. ఈ నేపథ్యంలో సోనాలి ఫోగట్ కుటుంబసభ్యులు ఈ కేసును బాలీవుడ్ దివంగత నుటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ కేసుతో పోల్చుతున్నారు. ఫోగట్ మృతి కేసు కూడా సుశాంత్ కేసులా కాకూడదని అంటున్నారు.

'సుశాంత్ సింగ్ హత్యకు గురై ఉంటాడని ఆయన కుటుంబసభ్యులు ఇంకా నమ్ముతున్నారు. రియా చక్రవర్తి అతనికి డ్రగ్స్ ఇచ్చింది. అయినా ఇప్పుడు ఆమె బయటే ఉంది. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఆ కేసు డ్రగ్స్ గురించి కాదు. హత్య గురించి' అని సోనాలి ఫోగట్ సోదరుడు కుల్‌దీప్ ఫోగట్ అన్నారు.

సోనాలి ఫోగట్ మృతికి కారణమైన వారిని ఉరి తీయాలని కుల్‍దీప్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమె హత్యకు గురైందని పోలీసులు రుజువు చేయలేకపోతే సీబీఐని ఆశ్రయిస్తామన్నారు. నార్కో టెస్టు కూడా నిర్వహించాలని కోరుతామన్నారు.

కుటుంబసభ్యుల అనుమతి అనంతరం సోనాలి భౌతికకాయానికి గురువారం పోస్టుమార్టం చేశారు వైద్యులు. ఆమె శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో గోవా పోలీసులు సోనాలి మృతిని హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమె సహాయకులిద్దరితో పాటు క్లబ్ ఓనర్, డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేశారు.
చదవండి:  సోనాలి ఫోగట్‌ దారుణ హత్య.. ఆ రెండున్నర గంటలేం జరిగింది?

మరిన్ని వార్తలు