ఇద్దరు మహిళల పెళ్లి.. సైకోలుగా ప్రవర్తిస్తూ దారుణం

14 Apr, 2021 07:08 IST|Sakshi

తల్లిదండ్రులపై ఎస్పీకి కుమారులు ఫిర్యాదు  

సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యాబుద్ధులు నేర్పించి సంతానాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన తల్లిదండ్రులే పెడమార్గం పట్టారు. వైవాహిక జీవితంలో ప్రకృతికి విరుద్ధమైన చేష్టలకు దిగడంతోపాటు పిల్లలను నరబలి ఇచ్చేందుకు సిద్ధపడడంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. బాధిత చిన్నారుల ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోడ్‌ జిల్లా పుంజైపులియంపట్టికి చెందిన రామలింగం (42) అనే వస్త్రవ్యాపారికి భార్య రంజిత (36), 15, 6 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం రామలింగం అదే ప్రాంతానికి చెందిన ఇందుమతి (32) అనే మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడు. తరువాత సదరు వ్యాపారి తన ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి ఈరోడ్‌ రంగపాళయం రైల్‌నగర్‌లో కాపురం పెట్టారు. కొన్ని రోజులకు ఇందుమతి స్నేహితురాలైన శశి (38) అనే మహిళను రంజిత పెళ్లి చేసుకుంది.

అంతేగాక శశిని నాన్నా అని, తండ్రైన రామలింగంను మామ అని పిలవాలని అమ్మ వేధింపులకు గురిచేయడం ప్రారంభించింది. నలుగురూ ఒకే ఇంటిలో ఉంటూ పిల్లలను పాఠశాలకు పంపకుండా ఇంటి పనులు చేయించేది. నాన్న చనిపోయాడని అబద్ధమాడి స్కూలు నుంచి టీసీలు కూడా తెచ్చింది. ఇంటి పనులు చేయించుకోవడం, చిన్న పొరపాటు చేసినా మిరప్పొడి ఒళ్లంతాపూసి బాధలకు గురిచేసింది. కొన్నిసార్లు క్రిమినాశిని ద్రావకాన్ని తాగమని ఒత్తిడి చేసింది.

ఇద్దరూ కలిసి తమను శివుడు, శక్తి అని పిలుస్తూ నరబలి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయడంతో పిల్లలిద్దరూ ఫ్రిబవరి 23న తాత, అవ్వ ఇంటికి చేరుకున్నారు. వారిని కూడా బెదిరింపులకు గురిచేయడంతో తాత, అవ్వతో కలిసి జిల్లా ఎస్పీ తంగదురైకి మంగళవారం ఫిర్యాదు చేశారు. వారి వేధింపుల నుంచి తమను రక్షించి, భద్రత కల్పించాలని, తల్లిదండ్రులపై తగిన చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

చదవండి:
కిరాతకం: అందరూ చూస్తుండగానే..     
ఎనిమిదో భార్యను చంపి జైలుకు, రెండో భార్య కొడుకు చేతిలో..

మరిన్ని వార్తలు