నంబర్‌ వన్‌.. సోనూ సూద్‌

10 Dec, 2020 02:03 IST|Sakshi

లండన్‌: లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు విశేషమైన సేవలందించిన నటుడు సోనూ సూద్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ‘2020లో ప్రపంచంలో టాప్‌ 50 ఆసియన్‌ సెలబ్రిటీల’ జాబితాలో ఆయన ఏకంగా మొదటి స్థానం దక్కించుకున్నారు. ఇలాంటి జాబితాను విడుదల చేయడం ఇదే ప్రథమం. యూకేలోని ఈస్టర్న్‌ ఐ అనే వార పత్రిక దీన్ని ప్రచురించింది. ఈ పత్రిక ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎడిటర్‌ అస్‌జాద్‌ నాజిర్‌ ఈ జాబితా రూపొందించారు. ఇందులో మొదటి స్థానంలో సోనూ సూద్, రెండో స్థానంలో కెనడా సోషల్‌ మీడియా స్టార్‌ లిల్లీ సింగ్‌లో నిలిచారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు 7వ స్థానం దక్కింది.

మరోమారు పెద్ద మనసు చాటుకున్న సోనూసూద్‌
ముంబై: తన చేతికి ఎముకే లేదని ప్రముఖ నటుడు సోనూ సూద్‌ నిరూపించుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన ప్రదర్శించిన దాతృత్వం దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ఆదుకోండి అని కోరుతూ ఇప్పటికీ సోనూ సూద్‌కు పెద్ద సంఖ్యలో లేఖలు వస్తున్నాయట. అందుకే రూ.10 కోట్లు సమీకరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ముంబైలోని 8 ఆస్తులను తాకట్టు(మార్ట్‌గేజ్‌) పెట్టినట్లు తెలిసింది. ఇందులో 2 దుకాణాలు, 6 ఫ్లాట్లు ఉన్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మార్ట్‌గేజ్‌ ఒప్పందం సెప్టెంబర్‌ 15న కుదిరింది. నవంబర్‌ 24న రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యింది. ఆయా ఆస్తులు సోనూ సూద్, ఆయన భార్య పేరిటే ఉంటాయి. వాటిపై వచ్చే అద్దెలు వారికే అందుతాయి. ఈ ఆస్తులను తాకట్టు పెట్టి తీసుకున్న రుణంపై వడ్డీని సోనూ సూద్‌ దంపతులు చెల్లించాల్సి ఉంటుందని జేఎల్‌ఎల్‌ ఇండియా రెసిడెన్షియల్‌ సేవల సంస్థల సీనియర్‌ డైరెక్టర్‌ రితేశ్‌ మెహతా చెప్పారు. అయితే, తన ఆస్తుల తాకట్టుపై సోనూ సూద్‌ ఇంకా స్పందించలేదు.

మరిన్ని వార్తలు