‘క‌రోనా పురుగు’ను కామెడీతో చంపేశారుగా!

11 Sep, 2020 13:26 IST|Sakshi

(వెబ్‌ స్పెషల్‌): ప్ర‌పంచాన్ని వ‌‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్‌ను కూడా మ‌న‌వాళ్లు వ‌ద‌ల్లేదు. కామెడీతో ఫుట్‌బాల్ ఆడుకున్నారు. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి అనేక పేర‌డి క‌థ‌లు, పాట‌లు, జోకులు, షార్ట్ ఫిలిమ్స్‌ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. కొంద‌రు ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల వ‌ర‌కు క‌రోనా పేరుతో కామెడీ సిక్స‌ర్ల‌ను బౌండరీలు దాటించారు. మొత్తం మీద‌ క‌రోనా సమయంలోనూ కామెడీ క‌ల్లోలం స్ప‌ష్టించింది. కొన్ని సంద‌ర్భాల్లో నెటిజ‌న్లు క‌రోనాపై వ‌చ్చిన హాస్యాన్ని స‌ర‌దాగా ఆస్వాదించ‌గా.. మ‌రి కొన్ని సంద‌ర్భాల్లో వెకిలి చేష్ట‌లు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లపై మండిప‌డ్డారు. హ‌ద్దులు దాటిన హాస్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కరోనాతో ప్ర‌పంచం అంతా వ‌ణికిపోతుంటే.. దీనిపై కూడా కామెడీ చేయ‌డం ఏమిటని ధ్వ‌జమెత్తారు. కరోనా వేళ.. కామన్‌ సెన్స్‌ లేకుండా చేస్తోన్న కామెడీ సెన్స్ పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యింది. (కంగన ఎందుకలా మాట్లాడుతుందో తెలుస్తా?)

కరోనాకు స్వాగతం పలికిన చార్మీ.. 
క‌రోనా వైర‌స్ దేశ రాజ‌ధానితో పాటు, తెలంగాణ‌లో ప్ర‌వేశించిన స‌మ‌యంలో కరోనా వైరస్‌కు స్వాగతం అంటూ సోషల్ మీడియాలో  ప్ర‌ముఖ న‌టి చార్మీ  వ్యాఖ్యలు చేయడంపై పెద్ద దుమారమే రేగింది. కోవిడ్ గురించి ఫన్నీగా  టిక్ టాక్ వీడియో చేసింది. ‘‘ఢిల్లీకి, తెలంగాణకి కరోనా వైరస్ చేరిందిట. హ.. హ.. హా.. వార్తల్లో చదివాను. మరి ఆల్ ది బెస్ట్ మీకు... హా.. హహ్హ..’’ అంటూ ఆమె చేసిన వెకిలి చేష్టలపై నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న చార్మి వెంటనే వీడియోను డిలీట్ చేయడంతోపాటు నెటిజన్లకు క్షమాపణ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

కరోనాను వదలని వర్మ..
వివాదాస్ప‌ద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కరోనా మహమ్మారిని కూడా వద‌ల్లేదు. కరోనాపై ఎన్నో వివాదాస్పద ట్వీట్లు చేసిన ఆయ‌న `కనిపించని పురుగు` పేరుతో ఓ గీతాన్ని కూడా స్వయంగా పాడారు. సాయంత్రం ఐదున్న‌ర గంట‌ల‌కు విడుద‌ల చేయాల్సిన ఈ పాట‌ను గంట ఆల‌స్యంగా విడుద‌ల చేసిన‌ వ‌ర్మ‌. టెస్ట్ చేస్తే పాజిటివ్ వ‌చ్చింది.. అది తగ్గిన త‌ర్వాత పాటను విడుద‌ల చేస్తున్నానంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. "మిమ్మ‌ల్ని డిజ‌ప్పాయింట్ చేస్తున్నందుకు సారీ, ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ అని డాక్ట‌ర్‌ చెప్పారు. ఇది ఆయ‌న త‌ప్పు, నాది కాదు" అని ట్వీట్ చేశాడు. భ‌యంక‌రంగా ఉన్న స్థితిని తేలిక చేయ‌డానికి మాత్ర‌మే తాను ప్ర‌య‌త్నిస్తున్నాన‌నీ, ఈ జోక్ త‌న‌ మీదే వేసుకున్నాన‌నీ ఆయ‌న అన్నారు. "ఎవ‌రినైనా నేను బాధించ‌క‌పోతే, వారికి సిన్సియ‌ర్‌గా క్ష‌మాప‌ణ‌లు చెప్తున్నా" అని మ‌రో జోక్ వేయ‌డంతో నెటిజ‌న్లు దుమ్మెత్తిపోశారు.

పగలబడి నవ్విన నాగబాబు..
ఒక కామెడీ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్రోమోలో క‌రోనాపై వ‌చ్చిన జోక్‌కి ప్ర‌ముఖ నటుడు నాగ‌బాబు ప‌గ‌ల‌ప‌డి న‌వ్వ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు మండిప‌డ్డారు. ‘‘కరీనా కాదు కరోనా, కరోనా అంటే చైనాది, కరీనా అంటే బాలీవుడ్ ది’’  అంటూ వేసిన‌ జోక్ కి నాగబాబు పడి పడి నవ్వడం ప‌ట్ల వివాద‌స్ప‌దం అయ్యింది. కరోనాతో ప్రపంచమే అల్లకల్లోలమ‌వుతుంటే ఇలాంటి జోకులా అంటూ నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

క‌రోనాపై నాగ‌బాబు చేసిన ట్వీట్ ప‌ట్ల‌ కూడా తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ‘‘కరోనాని కావాలనే కొన్ని మతాల వాళ్లు, వాళ్ల దేవుడే ఈ కరోనాని, భూమ్మీదకి పంపించారు. ఈ దేవుళ్లకి కోపం ఎక్కువే సుమీ’’  అంటూ నాగబాబు వేసిన సెటైర్ల‌పై ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సీరియస్ ఇష్యూపై జోకులు ఏమిటంటూ నెటిజ‌న్లు నిల‌దీశారు.


శ్రీరెడ్డి సంచలనం..
కరోనాపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో చేసిన‌ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కరోనా మహమ్మారి పోవాలంటే శృంగారం అవసరమంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. (కరోనా: సర్వేలో షాకింగ్‌ నిజాలు)

మతపెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు
క‌రోనా వైరస్‌ వ్యాపించడానికి అమ్మాయిలే కారణమంటూ పాక్‌కు చెందిన ఓ మతపెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డం తీవ్ర దుమారం రేపింది. అమ్మాయిలు పొట్టి దుస్తులు వేసుకోవడం వల్లే వైరస్‌ సోకిందని, వారి వల్లే ఎక్కువగా కరోనా వ్యాపిస్తోందని పాకిస్తాన్‌ మత పెద్ద మౌలానా తారీఖ్‌ జమీల్‌ వ్యాఖ్యనించారు. అది కూడా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సమక్షంలోనే ఈ వింత వ్యాఖ్య‌లు చేయడం మరింత దుమారానికి దారి తీసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అత్యంత ప్రమాదకర వైరస్‌పై బాధ్యతారహితంగా వ్యహరించిన తీరుపై నెటిజన్లు తీవ్రంగానే స్పందించినట్టు దీన్నిబట్టి అర్థమవుతోంది. సో.. కరోనాతో కామెడీలొద్దు!

>
మరిన్ని వార్తలు