అల్లా దయవల్లే చేస్తున్నా.. ఇప్పటికైతే అంతా సేఫ్‌!

29 Jul, 2020 08:55 IST|Sakshi

శ్రీనగర్‌: కరోనా వైరస్‌ ప్రపంచ గతినే మార్చివేసింది. ఇది అది అని కాకుండా అన్ని రంగాలు కుదేలయ్యాయి. దాంతోపాటు మానవ సంబంధాలకు మరింత విఘాతం కలిగింది. కరోనా బాధితులను అంటరానివారిగా చూసేవారు కొందరైతే, మహమ్మారి కారణంగా మృతి చెందిన కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు కూడా చేయని ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈక్రమంలో శ్రీనగర్‌ సెవెంత్‌ డిపార్ట్‌మెంట్‌లో అంబులెన్స్‌ డైవ్రర్‌గా పనిచేస్తున్న కోవిడ్‌ వారియర్‌ జమీల్‌ అహ్మద్‌ మాత్రం మనుషుల ప్రాణాలే ముఖ్యం అంటున్నాడు. తన ప్రాణాలకు రిస్కు ఉన్నప్పటికీ సేవచేస్తూ హీరో అనిపించుకుంటున్నాడు.

కుల, మతాలకు అతీతంగా కరోనా రోగులను ఆస్పత్రులకు తరలిస్తూ ప్రాణాలు నిలబెడుతున్నాడు. అలా శ్రీనగర్‌ పట్ణణంలోని దాదాపు 8 వేల మంది కోవిడ్‌ బాధితులను జమీల్ తన అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలించడం విశేషం. అంటే శ్రీనగర్‌లో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 80 శాతం బాధితులు జమీల్‌ అంబులెన్స్‌లోనే ఆస్పత్రులకు వెళ్లారు. ఇక ఎవరైనా అభాగ్యులు కోవిడ్‌తో మరణిస్తే వారి మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు కూడా అతను సాయం చేస్తున్నాడు. ఇక శ్రీనగర్‌లో ఇప్పటివరకు 85 మంది వైరస్‌తో చనిపోగా 70 మృతదేహాలను జమీల్‌ తన అంబులెన్స్‌లో తరలించాడు. ఖననంలో పాలుపంచుకున్నాడు.
(చదవండి: కరోనా రికవరీ రేటు 64%)

ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని అల్లా చెప్పాడు. దేవుని ఆశీస్సులతో తన వంతుగా నిస్సహాయులకు సాయం చేయగలుతున్నానని జమీల్‌ చెప్తున్నాడు. తన కుటుంబ సభ్యులతో భౌతిక దూరం పాటిస్తున్నానని, అల్లా దయవల్ల ప్రస్తుతానికి అందరం క్షేమంగా ఉన్నామని తెలిపాడు. కరోనా మృతదేహంతో తాము శ్మశానవాటికకు చేరుకోగానే అక్కడి సిబ్బంది పనిచేసేందుకు ముందుకు రారని, దాంతో తామే గొయ్యి తీసిన సందర్భాలు అనేకం ఉన్నాయని జమీల్‌ వెల్లడించాడు. ఇక జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా మొత్తం 18 వేల పాజటివ్‌ కేసులు నమోదవగా శ్రీనగర్‌లోనే బాధితులు అధికంగా ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 302 మంది కరోనాతో చనిపోయారు.
(వైరల్‌ వీడియో: పులి అసలు ఏం చేస్తోంది?)

మరిన్ని వార్తలు