బెంగళూరు హోటల్‌లో స్టార్‌బక్స్‌ ఫౌండర్‌.. మన కాఫీ, దోసెకు ఆయన ఫిదా

4 Nov, 2022 17:19 IST|Sakshi

వైరల్‌: ఖరీదైన కాఫీని అంతే హంగులున్న కప్‌తో సిప్‌చేస్తూ..ఆ ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తే!. సోషల్‌ మీడియాలో బిల్డప్‌ రాయుళ్ల వేషాలు ఇలాగే ఉంటాయి. అయితే.. ఆ ఖరీదైన కాఫీ వెనుక ఉన్న వ్యక్తే.. సాదాసీదా వ్యవహారంతో వార్తల్లో నిలిస్తే!.

ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఖరీదైన కాఫీ వ్యవహారం స్టార్‌బక్స్‌ గురించి!. ప్రపంచంలోనే ఖరీదైన కాపీ దుకాణాల్లో ఒకటి. అలాంటి స్టార్‌బక్స్‌ సహ వ్యవస్థాపకుడు జెవ్‌ సెయిగ్ల్‌ భారత్‌కు వచ్చారు. అంతేకాదు.. బెంగళూరులో ఓ హోటల్‌ను సందర్శించడమే కాదు.. అక్కడి రుచులను ఆస్వాదించారు కూడా. 

బెంగళూరులో చాలాకాలంగా విద్యార్థి భవన్‌ ఫేమస్‌. 1943లో ఓ చిన్ని హోటల్‌గా మొదలైంది అది. ఇప్పుడది బెంగళూరులో అత్యంత ఫేమస్ హోటల్‌లో ఒకటి. అక్కడికి విచ్చేశారు జెవ్‌ సెయిగ్ల్‌. అంతేకాదు.. ఆ హోటల్‌లో జనాలు ఎగబడి తినే మసాలా దోసెను, ఫిల్టర్‌ కాఫీని ఆస్వాదించారు కూడా. ఆపై అక్కడి గెస్ట్‌ బుక్‌లో.. తన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. ఈ అద్భుతమైన అనుభవాన్ని సియాటెల్‌కు మోసుకెళ్తానంటూ బుక్‌లో రాశారాయన.

అమెరికా వ్యాపారవేత్త అయిన జెవ్‌ సెయిగ్ల్‌.. 1971లో స్టార్‌బక్స్‌ను స్థాపించిన వాళ్లలో ఒకరు. ఆపై వైఎస్‌ ప్రెసిడెంట్‌గా, డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు.  2022 గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ కోసం ఆయన బెంగళూరు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మన ఫిల్టర్‌ కాఫీ, మసాలా దోసెలకు ఆయన ఫిదా అయ్యారు. చైనీస్‌, పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు బానిసలవుతున్న ఈ తరం.. మన ఆహారపు అలవాట్ల వైపు మళ్లాలంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.

A post shared by Vidyarthi Bhavan (@vidyarthibhavan)

మరిన్ని వార్తలు