గత 20 రోజులుగా క్రమంగా తగ్గుతున్న రోజువారీ కేసులు 

27 May, 2021 18:46 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా బలహీన పడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 20 రోజులుగా నమోదవుతున్న రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొంది. గత రెండు వారాలుగా రోజువారీ రికవరీల సంఖ్య  తాజా ఇన్ఫెక్షన్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉందని, అలాగే దేశవ్యాప్తంగా యాక్టీవ్ కేసులు కూడా  స్థిరంగా తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్  ప్రకటించారు. దేశంలో కోవిడ్ -19 పరిస్థితిపై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లవ్‌ అగర్వాల్  మాట్లాడుతూ..  

మే 7న గరిష్ట స్థాయి(4,14,188 పాజిటివ్ కేసులు) తరువాత, దేశంలో రోజువారీ కేసులు మే 12న 3,48,421 కు తగ్గాయని, ఆ సంఖ్య మే 17 నాటికి మూడు లక్షల లోపుకు పడిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత నేటి వరకు కేసుల సంఖ్య 3,00,000 మార్కును దాటలేదని, ఇది శుభపరిణామంగా పరిగణించవచ్చని తెలిపారు. ఇక దేశవ్యాప్త రికవరీ రేటు విషయానికొస్తే.. మే 3న 81.8 శాతంగాఉన్న రికవరీ రేటు,  మే 18న 85.6 శాతానికి పెరిగిందని, ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 90 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా సుమారు 2, 11,000 కొత్త కేసులు నమోదైనట్లు ప్రకటించారు. 
చదవండి: లక్షద్వీప్ భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తుంది..

మరిన్ని వార్తలు