అమెరికా స్కూల్‌లో ‘భారత ఫారెస్ట్‌ మ్యాన్‌’ పాఠం

2 Nov, 2020 13:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ ‘ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా చాలా మందికి సుపరిచితమే. నాలుగు దశాబ్ధాల పాటు ఒంటి చేత్తో కొన్ని వేల మొక్కలను నాటి ఏకంగా 550 ఎకరాల అడవిని సృష్టించాడు. గ్రామస్తులు చెట్లను నరకబోతుంటే ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడాడు. దీనిని గుర్తించిన భారతప్రభుత్వం అతనిని పద్మశ్రీతో సత్కరించింది. ఇక ఇప్పుడు జాదవ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని బిస్టల్‌ గ్రీన్‌ హిల్స్‌ స్కూల్‌లో ఆరవ తరగతి విద్యార్ధులకు బోధించే పాఠ్యాంశాలలో జాదవ్‌ గురించి తెలియజేస్తున్నారు.   దీని గురించి టీచర్‌ నవామీ శర్మ మాట్లాడుతూ, ఎకాలజీ పాఠాలలో భాగంగా జాదవ్‌ చేసిన పనులను వివరిస్తున్నారు. ఒక వ్యక్తి ఏవిధంగా సమాజం మీద పాజిటివ్‌ ప్రభావాన్ని చూపగలడో భవిష్యత్‌ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో జాదవ్‌ గురించి పాఠ్యాంశాలలో చెబుతున్నామని నవామీ అన్నారు. 

అస్సాంకు చెందిన జాదవ్‌ పాయెంగ్‌ మజులి అనే నదిముఖ ద్వీపంలోని బీడు భూమిలో 40 సంవత్సారాల నుంచి ఒక్కొక్క మొక్క నాటడం మొదలుపెట్టాడు. అలా ఆయన ఏకంగా 550ఎకరాలతో ఒక అడవినే తయారు చేశారు. ఆ అడవిలో ఏనుగులు, పులులు, జింకలు ఇంకా ఎన్నో జంతువులు ఉన్నాయి. ఒక్కడిగా జాదవ్‌ మొదలు పెట్టిన పనివలన ప్రస్తుతం ఉంటున్న వారితో పాటు వచ్చే తరాల వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అందుకే జాదవ్‌ గురించి అమెరికా పాఠ్య పుస్తకాలలో కూడా వివరిస్తున్నారు.  

చదవండి: 'టైగర్'‌ డాగ్‌.. వేటగాళ్ల గుండెల్లో గుబులు

మరిన్ని వార్తలు