తల్లి చెప్పినా వినలే.. పరీక్ష రాస్తూ మృత్యుఒడిలోకి

20 Feb, 2021 20:42 IST|Sakshi

పాట్నా: జ్వరం అని తెలిసి కూడా పరీక్ష రాయడానికి ఆ విద్యార్థి వెళ్లాడు. తల్లి వద్దని మొరపెట్టుకున్నా ‘పరీక్ష రాయకపోతే ఈ విద్యా సంవత్సరం వేస్ట్‌ అవుతుంది’ అని నచ్చచెప్పి విద్యార్థి పాఠశాలకు వెళ్లాడు. అతడి ఉష్ణోగ్రత పరీక్షించగా అధికంగా ఉండడంతో పరీక్ష రాయడానికి పాఠశాల అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా వారిని బతిమిలాడాడు. దీంతో తల్లితో పాటు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు. 

అతడు ఎలాగైనా పరీక్ష రాస్తానని పట్టుబట్టడంతో అధికారులు అంగీకరించి ఒక్కడే బయట పరీక్ష రాయడానికి అనుమతించారు. అయితే పరీక్ష రాస్తున్న సమయంలో ఆరోగ్యం విషమించడంతో ఆ విద్యార్థి మృతిచెందాడు. చేతిలో పెన్ను.. పేపర్‌ పట్టుకుని మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన బిహార్‌ రాష్ట్రంలో జరిగింది. మృతుడు రోహిత్‌ కుమార్‌.

నలంద జిల్లాలోని బిహార్‌ షరీఫ్‌ పట్టణంలో ఆదర్శ్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండేవాడు. బోర్డు పరీక్షలు కావడంతో ఆ విద్యార్థి ఈసారి ఎలాగైనా పరీక్షలు రాయాలని పట్టుబట్టి మరీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటనతో పాఠశాలలో విషాదం ఏర్పడింది. 

మరిన్ని వార్తలు