మార్క్స్‌ మెమోపై వాగ్వాదం.. ప్రిన్సిపాల్‌పై స్టూడెంట్‌ దాడిలో.. 

25 Feb, 2023 15:19 IST|Sakshi

భోపాల్‌: కొన్ని సందర్భాల్లో మనిషి తీసుకునే నిర్ణయాల కారణంగా జీవితమే నాశనం అవతుంది. ఇలాంటి సమయాల్లో ఎదుటి వ్యక్తులు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయి. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బీఫార్మసీ విద్యార్థి క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టాడు. ఆవేశంలో ప్రినిపాల్‌ను చంపేశాడు. 

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని బీఫార్మసీ కాలేజీలో అశ్‌తోష్‌ శ్రీవాస్తవ అనే విద్యార్థి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. అయితే, తన చదువు పూర్తవడంతో శ్రీవాస్తవ.. ఈనెల 20వ తేదీన కాలేజీకి వెళ్లాడు. ఈ క్రమంలో తన మార్కుల మెమోను ఇవ్వాలని కోరాడు. దీంతో, సెవెంత్ సెమిస్ట‌ర్ ఫెయిలైన కార‌ణంగా మెమో ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని ప్రిన్సిపాల్ విముక్త శ‌ర్మ‌ సమాధానం ఇచ్చారు. ఆమె రిప్లైతో ఆగ్రహానికి లోనైన శ్రీవాస్తవ.. తనకు మార్కుల షీట్‌ ఇవ్వడంలో కాలేజీ యాజమాన్యం అక్రమంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశాడు. 

ఇక, ఈ వ్యవహారంపై ఆవేశంలో శ్రీవాస్తవ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి సిగ‌రెట్ లైట‌ర్‌తో నిప్పంటించాడు. ఈ ఘటనలో విముక్త శర్మ శరీరం 80 శాతం కాలిపోయింది. దీంతో, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం విషమించి శనివారం ఆమె.. ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాద ఘటన జరిగిన రోజునే నిందితుడు శ్రీవాస్తవను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు