తండ్రిలాంటి వాడినంటూ ముద్దు పెట్టుకున్నాడు: స్టూడెంట్‌

28 May, 2021 21:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడు ప్రకంపనలు రేపుతున్న టీచర్ల లైంగిక వేధింపులు

పీఎస్‌బీబీ స్కూల్‌ ఘటన మరవక ముందే మరో స్కూల్లో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు

చెన్నై: విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్‌ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వేధింపులకు గురి చేసిన ఘటన తమిళనాడులో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో కీచక ఉపాధ్యాయుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. చెన్నైలో ఓ స్కూల్‌లో కామర్స్‌ బోధించే ఉపాధ్యాయుడు ఒకరు ఏళ్ల తరబడి విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. పాత విద్యార్థినిలు, ప్రస్తుత విద్యార్థినిలు అంతా కలిసి సుమారు 500 మందికి పైగా సదరు ఉపాధ్యాయుడిపై సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. అలాగే సదరు టీచర్‌ ఆగడాలను వివరిస్తూ.. పాఠశాల యాజమాన్యానికి మెయిల్‌ చేశారు.

‘‘క్లాస్‌ ఏడున్నరకైతే 7 గంటలకు రమ్మని సార్‌ నాకు మెసేజ్‌ పెట్టాడు. స్కూల్‌కి వెళ్లి చూస్తే అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు టీచర్‌ నన్ను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. దీని గురించి ఎవరికైనా చెప్తే నాపై తప్పుడు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు.. నేను అతడి మాట వినకపోవడంతో 11 గ్రేడ్‌లో ఉండగా నన్ను కొట్టాడు.. దారుణంగా అవమానించాడు’’ అంటూ ఓ విద్యార్థిని తన ఆవేదనను వ్యక్తం చేసింది. మరోక విద్యార్థిని ‘‘టీచర్‌ నన్ను అసభ్యకర రీతిలో తాకాడు.. తన ఒడిలో కూర్చుపెట్టుకుని నీ తండ్రిలాంటి వాడిని అన్నాడు.. ముద్దు పెట్టుకుని జస్ట్‌ ఫ్రెండ్లీగా కిస్‌ చేశాను’’ అనేవాడు అని ఆరోపించింది. 

ఇక అమ్మాయిల బాధలు ఇలా ఉంటే.. సదరు టీచర్‌ అబ్బాయిలను బూతులు తిడుతూ.. దారుణంగా హింసించేవాడు.. అందరి ముందు చితకబాదేవాడు. క్లాస్‌ టీచర్‌గా ఉన్నప్పుడు విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని మిస్‌ యూస్‌ చేసేవాడు. విద్యార్థినిలకు అసభ్య సందేశాలు పంపేవాడు. రిప్లై ఇవ్వకపోతే స్టూడెంట్స్‌ మీద వారి తల్లిదండ్రులకు తప్పుడు కంప్లైంట్స్‌ ఇస్తానని బెదిరించేవాడు. స్కూల్‌ అయిపోయాక కూడా కోచింగ్‌ పేరుతో విద్యార్థినిలను తన దగ్గరే ఉంచుకునేవాడు. రాత్రి 8, 9 గంటల ప్రాంతంలో వారికి ఇంటికి పంపేవాడు. 

వీటన్నింటి గురించి విద్యార్థులు మెయిల్‌ ద్వారా యాజమాన్యానకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సదరు టీచర్‌ని స్కూల్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. విద్యార్థినిల ఫిర్యాదు మమ్మల్ని కలచి వేసింది. సదరు టీచర్‌పై వచ్చిన ఆరోపణల గురించి దర్యాప్తు చేయడానికి ఒక అంతర్గత కమిటీని వేశాం. ఆరోపణలన్నింటిని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించి.. తగిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. 

చదవండి: లైంగిక వేధింపులు.. ఆన్‌లైన్‌ క్లాస్‌లో టవల్‌తో టీచర్‌

మరిన్ని వార్తలు