పర్లాకిమిడి(భువనేశ్వర్): గజపతి జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో మహేంద్రతనయ, వంశధార నదీజలాలు అడుగంటాయి. రాష్ట్ర సరిహద్దులో మహేంద్రతనయ నది చిన్నపాయలా ప్రవహిస్తోంది. పాతపట్నం మండలం–పర్లాకిమిడి సరిహద్దుల్లో ప్రజారోగ్యశాఖ ఇంజినీర్లు మహేంద్రతనయ వంతెన కింద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి, పంపుల సాయంతో నీటిని పర్లాకిమిడి లోని పీహెచ్ఈడీ పంప్హౌస్కి పంపిస్తున్నారు. పర్లాకిమిడిలో రోజుకు 12మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరం కాగా.. 8 మిలియన్ల గ్యాలన్ల తాగునీటిని మాత్రమే సరఫరా అవుతోందని అధికారులు తెలిపారు.
పట్టణంలో రోజూ ఉదయం గంట సేపు మాత్రమే తాగునీటిని అధికారులు అందిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో వర్షాలు పడకపోతే పట్టణ ప్రజలకు మరిన్ని ఇబ్బందుతు తప్పవని అభిప్రాయ పడుతున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలతో పర్లాకిమిడి డీఎన్ ప్యాలెస్ వద్ద నీటిని రిజర్వ్ చేశారు. మూడు గోట్టపు బావులు తవ్వకాలు చేపట్టారు. దీంతో కొంతవరకు నీటి ఎద్దడికి అడ్డకట్ట వేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పగటిపూట 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.