ఓటమి బాధ.. ఆగని కన్నీటి ధార  

26 Feb, 2021 14:21 IST|Sakshi

మైసూరు: మైసూరు మేయర్‌ పదవి నాకు రాకపోవడానికి ముఖ్య కారణం తాను సీఎం యడియూరప్ప బంధువు కావడమే కావచ్చని బీజేపీ కార్పొరేటర్‌ సునందా ఫాలనేత్ర అన్నారు. గురువారం ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. బుధవారం మేయర్‌ ఎన్నికలో ఆమె ఓడిపోయి కన్నీరు పెట్టుకోవడం తెలిసిందే. ఇప్పుడు కూడా మళ్లీ కంటనీరు పెట్టుకునే మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్నా. నాకు ఈ పదవి రావాల్సింది. ఇలా ఓడిపోవడం చాలా బాధ కలిగింది. నాకు పదవి రాకుండా ఎన్నో కుట్రలు జరిగాయి. నేను మేయర్‌ కావాలని సీఎం యడియూరప్ప ఎంతో కృషి చేశారు. సీఎం బంధువు కావడంతో కొందరు కావాలనే ఓడించారు అని వాపోయారు.

మరోవైపు మైసూర్‌ కార్పొరేటర్‌గా ఆమె రాజీనామా చేశారు. బీజేపీ తన మేయర్ అభ్యర్థిగా సునంద పలనేత్రను పోటీలో నిలిపింది. తమకు జేడీఎస్‌ మద్దతు అందిస్తుందని పార్టీ నాయకులంతా పూర్తి ఆశలు పెట్టుకున్నారు. కానీ జేడీఎస్‌ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపడంతో చివరికి జేడీఎస్‌ కార్పొరేటర్ రుక్మిణి మడేగౌడ మేయర్‌గా, కాంగ్రెస్‌కు చెందిన అన్వర్ బేగ్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు ..

కొత్త మేయర్‌కు పాత కేసు సమస్య 
కొత్త మేయర్‌ రుక్మిణి మాదేగౌడ గత ఎన్నికల సమయంలో ఆస్తుల వివరాలను సమర్పించలేదని ఆమె ప్రత్యర్థి రజిని అణ్ణయ్య గతంలో మైసూరు జిల్లా కోర్టులో కేసు వేశారు. విచారించిన కోర్టు రుక్మిణి ఎన్నికను రద్దు చేసి రజినిని కార్పొరేటర్‌గా ప్రకటించాలని తీర్పు చెప్పింది. అయితే రుక్మిణి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కేసును తిరగతోడాలని రజిని ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ కేసు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. తగిన ఆధారాలను సమర్పించాలని రజినిని జడ్జి ఆదేశించారు.

చదవండి: భార్య మేయరైతే.. ఆనందాన్ని ఆపడం ఎవరితరం?

మరిన్ని వార్తలు