కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికలపై సుప్రీం ఆందోళన

6 May, 2021 16:30 IST|Sakshi

సెకండ్‌ వేవ్‌నే అడ్డుకోలేకపోయారు.. థర్డ్‌వేవ్‌ను ఎలా ఎదుర్కొంటారు

కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

ఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికలపై సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. థర్ఢ్‌వేవ్‌ను ఎలా ఎదుర్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత కారణంగా చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఒకసారి పునరాలోచించుకోవాలని పేర్కొంది. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. కాగా దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ ప్రకంపనలతో ఇప్పటికే దేశం మొత్తం అతలాకుతలమవుతున్న సమయంలో థర్డ్‌ వేవ్‌ తప్పదంటూ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు డాక్టర్ కే విజయరాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

వేవ్‌ ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుందో స్పష్టత లేనప్పటికీ ముప్పు తప్పదన్నారు. అంతేకాదు థర్డ్‌ వేవ్‌ నాటికి వైరస్‌ మరింతగా మారవచ్చని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ తయారు చేసుకోవాలని విజయరాఘవన్‌ సూచించారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్‌ బాగా పని చేస్తోందని తెలిపారు.

గత వారం రోజులుగా 3 లక్షలకు తగ్గకుండా నమోదవుతున్న రోజువారీ కేసులు నేడు మరోసారి నాలుగు లక్షల మార్క్‌ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో 4,12,262 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు 3,980 మంది మృత్యువాతపడ్డారు.ఒకేరోజే 3,29,113 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,10,77,410కు చేరాయి. మృతుల సంఖ్య 2,30,168కు పెరిగింది. ప్రస్తుతం 35,66,398 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 16,25,13,339 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.
చదవండి: కరోనా నిబంధనలు బ్రేక్‌.. కుక్క అరెస్టు

మరిన్ని వార్తలు