వ్యాక్సిన్‌ కొనుగోలుపై కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు

2 Jun, 2021 17:53 IST|Sakshi

ఢిల్లీ: కోవిడ్‌-19 వ్యాక్సిన్ల కొనుగోళ్లపై బుధవారం సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ కొనుగోళ్ల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్రానికి తెలిపింది. టీకాలు వేసిన జనాభా శాతం( సింగిల్‌, డబుల్‌ డోసులు) డేటాను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు టీకాలు వేసుకున్న జనాభా శాతాన్ని తెలపాలని కేంద్రానికి స్పష్టం చేసింది. కాగా వ్యాక్సినేషన్‌పై కేంద్రం వ్యవహరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్‌ విధానం సరిగా లేదని.. కొందరికే వ్యాక్సిన్‌ వేయడం సహేతుకం కాదని పేర్కొంది.

ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో 1,32,788 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 2,31,456 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది. వైరస్‌ బారినపడి మరో 3,207 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,83,07,832కు పెరిగింది. ఇప్పటి వరకు 2,61,79,085 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం 3,35,102 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
చదవండి: వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం

కోవాగ్జిన్ ఉత్పత్తి పెంపు కోసం కేంద్రం కీలక నిర్ణయం

>
మరిన్ని వార్తలు