వినియోగదారుల చట్టం కిందకి విద్యాసంస్థలు?

22 Oct, 2020 06:09 IST|Sakshi

న్యూఢిల్లీ: విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల సేవల్లో లోపం వినియోగదారుల చట్టం–1986 కిందకు వస్తుందా అనే విషయాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తమిళనాడులోని సేలంకి చెందిన వినాయక మిషన్‌ యూనివర్సిటీ సరైన సేవలు అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైద్యవిద్యార్థి మనుసోలంకి, ఇతర విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌వేశారు. ధర్మాసనం ఈ అప్పీల్‌ను విచారణకు అంగీకరించింది. జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) నిర్ణయంపై అప్పీల్‌ ని పరిశీలించిన సుప్రీంకోర్టు, ఆరు వారాల్లోగా తమ వాదనను వినిపించాలని ఆదేశించింది.

మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ వర్సెస్‌ పీటీ కోషి కేసులో గతంలో సుప్రీంకోర్టు, విద్యని సరుకుగా పరిగణించలేమని తీర్పునిచ్చిన నేపథ్యంలో తిరిగి ఇది చర్చనీయాంశంగా మారింది. రెండు సంవత్సరాలు థాయ్‌లాండ్‌లోనూ, రెండున్నర సంవత్సరాలు యూనివర్సిటీలో చదువు చెప్పిస్తామని విద్యార్థులను 2005–2006 సంవత్సరంలో చేర్చకున్నారు. విద్యార్థులకు ఎంబీబీఎస్‌ ఫైనల్‌ డిగ్రీ సర్టిఫికెట్లు అందజేస్తామని, వాటికి కేంద్ర ప్రభుత్వం, మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు వచ్చేలా చూస్తామని కూడా ఇచ్చిన హామీని విద్యాసంస్థలు నెరవేర్చకపోవడంతో ఈ వివాదం చెలరేగింది. 

మరిన్ని వార్తలు