బిల్కిస్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం

5 Jan, 2023 05:36 IST|Sakshi

న్యూఢిల్లీ: బిల్కిస్‌ బాను అత్యాచార ఘటన దోషుల ముందస్తు విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు సీపీఎం నేత సుభాషిణీ అలీ, తృణమూల్‌ కాంగ్రెష్‌ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదీల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

కాసేపటికే, ఈ విషయమై గతంలో బిల్కిస్‌ బానో వేసిన పిటిషన్‌పై విచారణ నుంచి గత డిసెంబర్‌ 13న జస్టిస్‌ త్రివేదీ తప్పుకున్న విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో న్యాయమూర్తులిరువురూ కాసేపు చర్చించుకున్నారు. అనంతరం ఈ విచారణ నుంచి కూడా ఆమె తప్పుకుంటున్నట్టు జస్టిస్‌ రస్తోగీ చెప్పారు. ఆమె స్థానంలో మరో న్యాయమూర్తితో కలిసి ఫిబ్రవరి నుంచి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. తాజా పిటిషన్లను బిల్కిస్‌ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌కు కలిపి విచారిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు