మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సుప్రీం నోటీసులు

10 Aug, 2020 14:34 IST|Sakshi

న్యూఢిల్లీ: మార్గదర్శి కేసులో రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీడ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది. కాగా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు రూ.2,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని మాజీ ఐజీ కృష్ణంరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌యుఎఫ్ (హిందూ జాయింట్‌ ఫ్యామిలీ) వ్యక్తుల సమూహం కాదని, ఆర్బీఐ నిబంధనలు వర్తించవని ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు జస్టిస్‌ రజిని రామోజీరావుపై కేసును కొట్టివేశారు. 

ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఇంప్లీడ్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.


(మార్గదర్శి కేసులో.. ఉండవల్లి పిటిషన్‌ స్వీకరణ)

మరిన్ని వార్తలు