మే 8 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు!

27 Apr, 2021 08:30 IST|Sakshi

తుది నిర్ణయం తీసుకోనున్న ఫుల్‌ కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది సుప్రీంకోర్టు వెసవి సెలవులు వారం రోజులు ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సుప్రీంకోర్టు అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సోమవారం సీజేఐ ఎన్వీ రమణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారం రోజుల ముందుగానే సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించాలన్న ఆయా ప్రతినిధుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తానని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. అయితే, తుది నిర్ణయం ఫుల్‌ కోర్టు తీసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు క్యాలెండర్‌ ప్రకారం వేసవి సెలవులు మే 14 నుంచి జూన్‌ 30 వరకూ ఉండాలి. దీన్ని వారం రోజులు ముందుకు జరిపి మే 8 నుంచి జూన్‌ 27 వరకు వేసవి సెలువులు ప్రకటించాలని బార్‌ అసోసియేషన్‌ కోరింది.

సోమవారం కోర్టు సస్పెన్షన్‌
జస్టిస్‌ శాంతనుగౌడర్‌ మరణంతో సుప్రీంకోర్టు ఫుల్‌ కోర్టు సోమవారం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. సోమవారం జ్యుడీషియల్‌ బిజినెస్‌ను సస్పెండ్‌ చేస్తున్నుట్ల సుప్రీంకోర్టు ప్రకటించింది. సోమవారం విచారించాల్సిన అంశాలన్నీ మంగళవారం చేపడతారని పేర్కొంది. ‘‘సోదరుడు జస్టిస్‌ శాంతనుగౌడర్‌ మృతి పట్ల అందరం చాలా బాధ పడ్డాం. జ్ఞాపకార్ధం గౌరవ చిహ్నంగా మౌనం పాటిస్తున్నాం’’ అని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు.  

చదవండి: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ శంతను గౌడర్‌ మృతి

మరిన్ని వార్తలు