హిజాబ్​ వ్యవహారం: అత్యవసర పిటిషన్​కు సుప్రీం నో.. చీఫ్​ జస్టిస్​ ఆసక్తికర వ్యాఖ్యలు

11 Feb, 2022 12:53 IST|Sakshi

కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. ఈ మేరకు పిటిషన్​ను తోసిపుచ్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
 
సాక్షి, న్యూఢిల్లీ: పిటిషన్​పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండి. ఆదేశాలు వెలువడక ముందే ఏం చేయగలం?. ఏమి జరుగుతుందో మాకు తెలుసు. దయచేసి ఈ అంశాన్ని పెద్దది చేయొద్దు. అసలు ఈ అంశాన్ని జాతీయ స్థాయి.. ఢిల్లీకి తీసుకురావడం సరైందేనా? ఒక్కసారి ఆలోచించండి. దేశ పౌరులు అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే మేము ఇక్కడ ఉన్నాం. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటాం. హిజాబ్​ వ్యవహారాన్ని పెద్దది చేయకండి’’ అని వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉండగా.. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం స్టూడెంట్స్​ హిజాబ్​తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్​ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. అంతేకాదు విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర  ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ముస్లిం మహిళలకే నష్టమని, దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ఓ విద్యార్థి పిటిషన్​ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్​ విచారణకు సుప్రీం నో చెప్పింది. 

ఇదే పిటిషన్​పై వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. కర్ణాటక హైకోర్టు ఇంకా ఆదేశాలు (తుది) ఇవ్వకుండా.. సుప్రీం కోర్టులో ఎలా సవాలు చేస్తారు? అని ప్రశ్నించారు. హైకోర్టును తేల్చనీయండి. దీన్ని రాజకీయం, మతపరం చేయవద్దు అని తుషార్​ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. గురువారం ఫాతిమా బుష్రా అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్​ను సైతం సుప్రీం తోసిపుచ్చింది. ఆమె తరపున వాదనలు వినిపించిన కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌.. ఈ అంశం దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘మేం పరిశీలిస్తాం’ అంటూ చీఫ్‌ జస్టిస్‌ రమణ  అన్నారు.

మరిన్ని వార్తలు