సరైన సమయం కాదని మీరెలా చెప్తారు: హోం శాఖపై సుప్రీం సీరియస్‌

21 Apr, 2022 18:01 IST|Sakshi

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేం జైలు శిక్ష వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు,  కేంద్ర హోంశాఖపై, హోం శాఖ సెక్రటరీపై మండిపడింది.  కేంద్ర మంత్రిత్వ శాఖ అభ్యర్థనను తొందరపాటుగా అభివర్ణిస్తూనే.. నిర్ణయాత్మకంగా కేంద్రం వ్యవహరించడం మంచిదికాదని గురువారం అత్యున్నత న్యాయస్థానం మందలించింది.

అభ్యర్థన పిటిషన్‌పై ఏం చేయాలో హోం సెక్రటరీ మాకు చెప్పే ప్రయత్నంగా అఫిడవిట్‌ను చూస్తే అనిపిస్తుంది. ఆయన మాకు చెప్పడం కాదు. అది అర్థం చేసుకోండి. మేం ఏం చేయాలో అది చేస్తాం. సమస్యను సరైన సమయంలో పరిష్కరించమని మాకు చెప్పడానికి హోం కార్యదర్శి ఎవరు?. అసలు హోం మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్‌లో..  ‘ఇది సరైన సమయం కాదు’ అనే లైన్‌ను ఎందుకు చేర్చారు అని అభ్యంతరం వ్యక్తం చేశారు జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌.

1993 బాంబే పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అబూ సలేంని.. పోర్చుగల్‌ నవంబర్‌ 11, 2005లో బారత్‌కు అప్పగించింది. ఆ సమయంలో 25 ఏళ్లకు మించి జైలు శిక్ష విధించబోమని పోర్చుగల్‌ న్యాయస్థానాలకు భారత్‌ చెప్పింది. ఆ మాట ప్రకారం..  2030, నవంబర్‌ 10న శిక్షా కాలం ముగుస్తుంది. అయితే తన శిక్షాకాలం ఒప్పందానికి విరుద్ధంగా ఉందంటూ సలేం సుప్రీం కోర్టులో అభ్యర్థన పిటిషన్‌ దాఖలు చేశాడు. 

దీనికి ప్రతిస్పందనగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తరపున కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా.. మంగళవారమే ఓ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు చర్య అవుతుందని ఓ లైన్‌లో పేర్కొన్నారాయన. అబూ సలేం పిటిషన్‌పై స్పందించడానికి ఇంకా సమయం ఉందని, ఇది సరైన సమయం కాదని అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.  ఇది న్యాయస్థానానికి ఆగ్రహం తెప్పించింది. న్యాయవ్యవస్థకు ఉపన్యాసాలు ఇవ్వవద్దు. మీరు నిర్ణయించుకోవాల్సిన విషయాన్ని నిర్ణయించమని మీరు మాకు చెప్పినప్పుడు మేము దానిని దయతో పరిగణనలోకి తీసుకోం. సరైన సమయం కాదని మీరెలా చెప్తారు.. అని జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిపై మండిపడ్డారు.

ఇక 2017లో అబూ సలేంను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది ఇక్కడి న్యాయస్థానం. ముంబైలో 1993 మార్చి 12న రెండు గంటల వ్యవధిలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 257 మంది దుర్మరణం చెందగా.. 700 మంది గాయపడ్డారు.

చదవండి: ఉచిత పథకాలపై నిర్ణయం ఓటర్లదే!. సుప్రీంలో..

మరిన్ని వార్తలు