కామర్స్‌ చదివి వైద్యులకు బోధిస్తారా?

1 May, 2021 12:11 IST|Sakshi

పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం 

రూ.1000 జరిమానా  

సాక్షి, న్యూఢిల్లీ: కామర్స్‌ చదువుకొని వైద్యులు, వైద్య నిపుణులకు కరోనా చికిత్స ఎలా చేయాలో బోధిస్తారా అంటూ పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ నిర్ధారణకు చేయాల్సిన పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అంశాలు సూచిస్తూ వాటిపై ఆదేశాలు ఇవ్వాలంటూ కోల్‌కతాకు చెంది న సురేష్‌ షా అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మీరు వైద్యులా.. కోవిడ్‌పై మీకున్న జ్ఞానం ఏంటి అని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.

శాస్త్రీయ పత్రాల ఆధారంగా పిటిషన్‌ దాఖలు చేశానని పిటిషనర్‌ తెలిపారు. ఇలాంటి పనికిమాలిన పిటిషన్లు వేయడమే మీ పనా అని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు. వర్చువల్‌ హియరింగ్‌ కాబట్టి ఎలాంటి ఖర్చులేదు. ఈ తరహా పిటిషన్‌తో కోర్టు సమయం వృథా చేసినందుకు రూ.లక్ష జరిమానా విధించాలనుకుంటున్నాం అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌ తాను నిరుద్యోగినని పేర్కొనగా రూ.1000 జరిమానా విధించిన ధర్మాసనం పిటిషన్‌ కొట్టివేసింది.
చదవండి: సెకండ్‌ వేవ్‌: ఒక్కరోజే 4 లక్షల కరోనా కేసులు

మరిన్ని వార్తలు