Maratha Reservation: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

5 May, 2021 14:12 IST|Sakshi

న్యూఢిల్లీ: మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ రిజర్వేషన్లు చట్టవిరుద్ధమని పేర్కొంటూ రద్దు చేసింది. 50 శాతానికి రిజర్వేషన్లు మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్టేనని పేర్కొంటూ బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనుకున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి చుక్కెదురైంది. కాగా విద్య, సామాజికపరంగా వెనుకబడిన వర్గంగా మరాఠా సామాజిక వర్గాన్ని గుర్తిస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో విద్యాసంస్ధల్లో ప్రవేశాలు,  ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్‌లు ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకువచ్చింది. ఇక ఈ చట్టాన్ని సమర్ధించిన బాంబే హైకోర్టు 16 శాతం రిజర్వేషన్‌ సరైంది కాదని, మరాఠాల కోటా ఉద్యోగాల్లో 12 శాతం మించరాదని, అడ్మిషన్లలో 13 శాతం మించరాదని 2019లో తీర్పునిచ్చింది. ఈ క్రమంలో రిజర్వేషన్ల అంశం, బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన ఐదుగురు  న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ‘‘మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో తీసుకువచ్చిన చట్టం సమానత్వపు హక్కును ఉల్లంఘించేదిగా ఉంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు 50 శాతంగా ఉన్న పరిమితిని ఉల్లంఘించడం సరైనది కాదు. 50 శాతం రిజర్వేషన్లు మించరాదనే 1992 నాటి తీర్పును పునఃపరీక్షించలేం’’ అని స్పష్టం చేస్తూ మరాఠా రిజర్వేషన్లను నిలిపివేసింది.  

చదవండి: బెంగాల్‌లో హింస, సుప్రీంకోర్టుకు బీజేపీ

>
మరిన్ని వార్తలు