ఆ వ్యక్తిని సాక్షి గుర్తు పట్టడం.. అత్యంత బలహీనమైన సాక్ష్యమే: సుప్రీం 

24 Oct, 2021 17:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒక నేరం జరిగిన సమయంలోనే నిందితుడిని మొదటిసారి చూసి, ఆ తర్వాత కోర్టులో ఆ వ్యక్తిని సాక్షి గుర్తు పట్టడం అనేది అత్యంత బలహీనమైన సాక్ష్యాధారమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందులోనూ నేరం జరిగిన తేదీకి, కోర్టులో విచారణ జరిగే సమయానికి మధ్య కాల వ్యవధి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సాక్ష్యం మరింత బలహీనంగా మారుతుందంది. మద్యం అక్రమ రవాణా కేసులో కేరళ అబ్కారీ చట్టం కింద దోషులుగా నిర్ధారించిన నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అభయ్‌ల  ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

చదవండి: (‘పరారీలో ఉంటే ముందస్తు బెయిలు వీలుకాదు’)

నలుగురు వ్యక్తులు 6,090 లీటర్ల మద్యాన్ని 174 ప్లాస్టిక్‌ క్యాన్లలో ఉంచి తప్పుడు రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనంలో తరలిస్తున్నారని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. 11 ఏళ్ల నాటి ఘటనలో మొదటిసారి ఆ వ్యక్తుల్ని చూసినందున వారిని గుర్తు పట్టలేకపోతున్నానని సాక్షి పేర్కొన్నారు. అయితే వారిలో ఇద్దరిని మాత్రం ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌లో గుర్తు పట్టగలిగారు. దీంతో సుప్రీంకోర్టు ఆ సాక్ష్యం చెల్లదని ప్రకటించింది. నలుగురు నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు