సాక్షి, ఢిల్లీ: అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవలే అన్నాడీఎంకే సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికయిన సంగతి తెలిసిందే. పళనిస్వామి ఎన్నిక సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. మద్రాస్ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో అన్నాడీఎంకే తాతాల్కిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగేందుకు ఈపీఎస్కు లైన్ క్లియర్ అయింది.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వం అమలులోకి వచ్చింది. పళనిస్వామి, పన్నీరు సెల్వం ఉమ్మడిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే గత ఏడాది జూలైలో నిర్వహించిన సమావేశంలో ద్వంద్వ నాయకత్వ విధానాన్ని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ రద్దు చేసింది. పార్టీ తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామిని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ నిర్ణయాన్ని పన్నీరు సెల్వం హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.