చెక్‌ బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారంపై కమిటీ

11 Mar, 2021 14:08 IST|Sakshi

కమిటీకి బాంబే హైకోర్ట్‌ మాజీ న్యాయమూర్తి నేతృత్వం

మూడు నెలల్లో నివేదిక

అదనపు కోర్టుల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కోర్టుల్లో పేరుకుపోతున్న చెక్‌బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి సారించిన అత్యున్నత న్యాయస్థానం, ఈ దిశలో బుధవారం కీలక చర్య తీసుకుంది. ఇందుకు సంబంధించి తగిన సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. కమిటీకి బాంబే హైకోర్ట్‌ మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ సి చవాన్‌ నేతృత్వం వహిస్తారు. మూడు నెలల్లో కమిటీ తన సిఫారసులను సమర్పించాల్సి ఉంటుంది. భారీగా పేరుకుపోయిన నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రమెంట్‌(ఎన్‌ఐ) యాక్ట్‌ కేసుల కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటే సరైన మార్గమని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం పేర్కొంది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎల్‌ నాగేశ్వరరావు, బీఆర్‌ గవాయ్, ఏఎస్‌ బోపన్న, ఎస్‌ రవీంద్రభట్‌లు ఉన్నారు. కాగా, ఈ కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అత్యున్నత న్యాయస్ధానానికి తన వాదనలు వినిపిస్తూ, విధివిధానాలు ఖరారయిన తర్వాత రాజ్యాంగంలోని 247వ అధికరణ అనుగుణంగా చెక్‌బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేంద్రం ‘‘సూత్రప్రాయంగా అంగీకరించింది’’ అని తెలిపారు. 

12వ తేదీనాటికి సభ్యుల పేర్లు ఖరారు 
కమిటీలో ఇతర సభ్యులుగా ఆర్థిక సేవల శాఖ అధికారి (అడిషినల్‌ సెక్రటరీ హోదాకు తగ్గని), న్యాయ, కార్పొరేట్‌ వ్యవహారాలు, వ్యయాలు, హోమ్‌ శాఖలకు చెందిన అధికారులు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (చైర్మన్‌ నామినేట్‌ చేసిన) ప్రతినిధులు, నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్రతినిధి, సొలిసిటర్‌ జనరల్‌ లేదా ఆయన నామినీ కమిటీలో ఇతర సభ్యులుగా ఉంటారు. సిఫారసులను రూపొందించడంలో అవసరమైన సహాయ సహకారాలు అన్నింటినీ కేంద్రం అందించాల్సి ఉంటుంది. కమిటీ ఈ అంశంలో నిపుణులనూ సంప్రతించవచ్చు. సభ్యుల పేర్లు అన్నింటినీ మార్చి12వ తేదీలోపు ధర్మాసనానికి సమర్పించాలని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన విచారణలో అత్యున్నత న్యాయస్థానం సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది. 

2005నాటి కేసు విచారణ నేపథ్యం..
చెక్‌బౌన్స్‌లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సూ మోటోగా (తనకు తానుగా) ఈ కేసు గత ఏడాది మార్చి 5న విచారణకు చేపట్టింది. 2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య (కోర్టుల్లో చెక్‌ బౌన్స్‌ కేసుల దీర్ఘకాలిక విచారణ అంశం) అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్‌ అడ్వకేట్‌ సిద్ధార్థ్‌ లుథ్రా, అడ్వకేట్‌ కే. పరమేశ్వర్‌లు నియమితులయ్యారు. కేసులో ఇప్పటికే కేంద్రం, హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్, డీజీపీలు, నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)లకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ అయ్యాయి. కోర్టుల్లో 35 లక్షల చెక్‌బౌన్స్‌ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్‌ కేసుల్లో 15 శాతం పైగా) పేరుకుపోవడం ఒక ‘వింత’ని ఈ కేసులో ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు సత్వర పరిష్కారం అవసరం అని కేంద్రానికి స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు