7 గంటల్లో 101 మందికి: మ్యాగీ జేసినంత ఈజీగా ఆపరేషన్లు

4 Sep, 2021 17:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏడు గంటల్లో 101 మందికి ట్యూబెక్టమీ శస్త్ర చికిత్సలు

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా నర్మదాపూర్‌లో ఘటన

రాయిపూర్‌: ఓ వైద్యుడు ఉద్యమం మాదిరి శస్త్ర చికిత్సలు చేశాడు. భారీ ఎత్తున ఆపరేషన్లు చేయడం కలకలం రేపింది. నిర్విరామంగా ఏడు గంటలపాటు 101 మందికి కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్ర చికిత్సలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆ వైద్యుడు ఆపరేషన్లు చేశాడు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
చదవండి: ఆస్పత్రి బాత్రూమ్‌లో ప్రసవించిన అత్యాచార బాధితురాలు 

సుర్గుజా జిల్లా నర్మదాపూర్‌ ఆరోగ్య కేంద్రంలో ఆగస్టు 27వ తేదీన మెగా స్టెరిలైజేషన్‌ క్యాంప్‌ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఒక వైద్యుడు రోజుకు 30 కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాలి. కానీ ఈ క్యాంప్‌లో ఏకంగా 101 ఆపరేషన్లు చేశారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రభుత్వ సర్జన్‌ శస్త్ర చికిత్సలు నిర్వహించాడు. ఈ శస్త్ర చికిత్సలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళల ఆరోగ్యం చూడకుండా ఇష్టమొచ్చిన తీరునా శస్త్ర చికిత్సలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ విమర్శలు రావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించారు. ఆగస్టు 29న ఆ జిల్లా వైద్యాధికారి పీఎస్‌ సిసోడియా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సర్జికల్‌ స్పెషలిస్ట్‌ జిబ్నస్‌ ఎక్కా, మరో వైద్యుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ సింగ్‌లకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేశారు. దీనిపై వైద్యులు కమిటీకి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. ఆ రోజు శిబిరానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారని కమిటీకి తెలిపినట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి మహిళలు వచ్చారని, వారు మళ్లీ అంత దూరం నుంచి రాలేకపోతామని వాపోయారని, అందుకే శస్త్ర చికిత్సలు చేసినట్లు తెలుస్తోంది. మహిళల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు వివరణ ఇచ్చారు. అయితే శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళలంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

చదవండి: సీక్రెట్‌ యాప్‌తో భార్య ఫోన్‌ ట్యాపింగ్‌.. ఆమెపై నీడలా భర్త

మరిన్ని వార్తలు