కోళీకోడ్ ప్ర‌మాదం: భయంతో ముందు సీట్లను పట్టుకున్నాం

8 Aug, 2020 16:10 IST|Sakshi

సాక్షి, కోళీకోడ్: కేరళలోని కోళీకోడ్‌ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గురై  విమానం నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఈ దుర్ఘనటన తీవ్రమైన వేదనను మిగిల్చింది.  ‘ఇది చాలా పెద్ద విషాదం. విమానం నేలపై కూలినపప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో మమ్మల్ని మేము సమన్వయం చేసుకోవడానికి మా ముందు సీట్లను భయంతో గట్టిగా పట్టుకున్నాము. ఇక విమానం కూలిపోవటంతో అది రెండు ముక్కలుగా విరిగిపోయింది’ అని ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఐదుగురు ప్రయాణికుల్లో ఒకరు తెలిపారు.

‘చుట్టు పక్కల అందరూ ఏడుస్తున్నారు. పైలట్లు, ఇద్దరు మహిళలు మృతి చెందారని ఎవరో నాకు చెప్పారు. ఆ తర్వాత పేపర్‌లో 18మంది చనిపోయినట్లు వచ్చింది. బహుశా ఈ ప్రమాదానికి వాతావరణం కారణం కావొచ్చని మరో బాధితుడు తెలిపారు. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోతే మరో విమాశ్రయంలో ల్యాండ్‌  చేయల్సింది. కానీ ఒక్కసారిగా ఏం జరిగిందో కూడా తెలియదు. ఒక కలలా విమానం కూలి ప్రమాదం జరిగింది’ అని మరొక ప్రయాణికుడు చెప్పారు. ఐదుగురు బాధితులను విమ్స్‌ ఆస్పత్రిలో చేర్చినట్లు డాక్టర్‌ ముహమ్మద్‌ షఫీ పేర్కొన్నారు. అదే విధంగా చాలామంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ సత్య ప్రధాన్‌ తెలిపారు.   

శుక్రవారం రాత్రి కోళీకోడ్‌ విమనాశ్రయంలో విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో విమానం రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో పది మంది చిన్నారులు.. ఇద్దరు పైలట్లు, అయిదుగురు క్యాబిన్ క్రూ ఉన్నారు.

>
మరిన్ని వార్తలు