నొప్పిలేని మరణం ఎలా?

4 Aug, 2020 04:20 IST|Sakshi

గూగుల్‌లో సెర్చ్‌ చేసిన సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌

ముంబై/పట్నా: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించే సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడినట్లు ముంబై పోలీసు కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ తెలిపారు. ఆత్మహత్యకు ముందు ‘నొప్పి లేకుండా ఎలా చనిపోవాలి? మెంటల్‌ డిజార్డర్‌ అంటే ఏమిటి?’ అనే అంశాలపై గూగుల్‌లో పదే పదే సెర్చ్‌ చేశాడని చెప్పారు. మాజీ మేనేజర్‌ దిశా షాలియన్‌ మరణంతో తనకు సంబంధం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలతో సుశాంత్‌ కలత చెందాడని వివరించారు. అతడు మరణించిన వెంటనే కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు 56 మంది సాక్షుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడి ప్రస్తావన రాలేదన్నారు. సుశాంత్‌ బ్యాంకు ఖాతా నుంచి ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తి ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ అయినట్లు ఇంకా తేలలేదన్నారు. సుశాంత్‌ ఆత్మహత్యపై విచారణ నిమిత్తం బిహార్‌ ఐపీఎస్‌ అధికారి ఆదివారం ముంబై చేరుకున్నారు. అయితే ముంబై పోలీసులు ఆయనను బలవంతంగా క్వారంటైన్‌కు పంపించారు. ఈ ఘటనను బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఖండించారు.

మరిన్ని వార్తలు