మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశారు

12 Aug, 2020 15:22 IST|Sakshi

లేఖ విడుదల చేసిన సుశాంత్‌ కుటుంబం

ముంబై : బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై విచారణకు సంబంధించి, తమ కుటుంబంపై జరుగుతున్న దుష్ర్పచారంపై సుశాంత్‌ కుటుంబ సభ్యులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. సుశాంత్‌కు తన కుటుంబంతో సరైన సంబంధాలు లేవని శివసేన పత్రిక సామ్నాలో ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ రాసిన సంపాదకీయం అనంతరం ఈ లేఖను సుశాంత్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. నటుడకి తాము చాలా సన్నిహితులమని చెబుతూ కొందరు మీడియాలో ప్రకటనలు చేస్తున్నారని ఈ లేఖలో సుశాంత్‌ కుటుంబం మండిపడింది. నటి రియా చక్రవర్తి పేరును ప్రకటనలో ప్రస్తావించకపోయినా సుశాంత్‌ను దారుణంగా హత్య చేశారని పేర్కొంది. ఈ కేసులో ఖరీదైన న్యాయవాదులను నియమించుకున్నారని, వారు న్యాయాన్ని హతమారుస్తారా అని లేఖలో సుశాంత్‌ కుటుంబం విస్మయం వ్యక్తం చేసింది.

సుశాంత్‌పై మానసిక రోగి ముద్ర వేసి, మృతదేహం ఫోటోలను బహిర్గతం చేసి తమకు సంతాపం తెలిపేందుకూ సమయం ఇవ్వలేదని పేర్కొంది. ముంబై పోలీసుల విచారణ కొద్దిమంది సంపన్నుల ఉద్దేశాలను వెల్లడించేలా సాగిందని ఆరోపించింది. తమ కుటుంబం పోలీసులను ముందుగానే సంప్రదించినా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని లేఖ సూటిగా ప్రశ్నించింది. సుశాంత్‌ నలుగురు అక్కలతో పాటు తండ్రినీ బెదిరిస్తున్నారని, తమ కుటుంబం ప్రతిష్ట మసకబార్చేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సుశాంత్‌ జ్ఞాపకాలకూ కళంకం ఆపాదిస్తున్నారని మండిపడింది. ఇక సుశాంత్‌ ఆయన సోదరిల గురించి లేఖలో ప్రస్తావిస్తూ పెద్ద కుమార్తె విదేశాల్లో ఉంటారని, రెండో కుమార్తె జాతీయ క్రికెట్‌ టీమ్‌లో ఆడారని, మూడో కుమార్తె లా చదవగా, నాలుగో కుమార్తె ష్యాషన్‌ డిజైనింగ్‌లో డిప్లమో చేశారని ఈ ప్రకటన పేర్కొంది. ఐదో సంతానంగా సుశాంత్‌ తన తల్లికి గారాల బిడ్డని తెలిపింది. తమ కుటుంబం ఏ ఒక్కరి నుంచి ఏమీ ఆశించలేదని, ఎవరికీ హాని తలపెట్టలేదని స్పష్టం చేసింది. చదవండి : సుశాంత్‌ కేసు : ఫోరెన్సిక్‌ నివేదికలో కీలక విషయాలు

మరిన్ని వార్తలు