తీహార్‌ జైలు అధికారుల సస్పెన్షన్‌

7 Oct, 2021 06:17 IST|Sakshi

యూనిటెక్‌ కేసులో సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: యూనిటెక్‌ మాజీ ప్రమోటర్లు సంజయ్, అజయ్‌ చంద్రాతో కుమ్మక్కైయ్యారంటూ తీహార్‌ జైలు అధికారులు కొందరిని సస్పెండ్‌ చేయమని, వీరిపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ ఆస్తానా అందించిన నివేదిక ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. చంద్ర సోదరులు జైలు నుంచే దందా జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఈడీ విచారణ జరిపి నిర్ధారించింది.

జైలు అధికారుల సస్పెన్షన్‌తో పాటు జైలు నిర్వహణపై ఆస్తానా సూచించిన సిఫార్సులను అధ్యయనం చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. విచారణ సందర్భంగా బెంచ్‌తో నిందితుల న్యాయవాది వికాస్‌ సింగ్‌ తీవ్రంగా వాదించారు. తన క్లయింట్‌కు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ తాలుకు పత్రాలు అందించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో ఈ కేసులో తన క్లయింట్‌ నిర్ధోషని తేలితే కాలాన్ని వెనక్కు తిప్పలేరని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా భాషను తాము అంగీకరించమన్నారు. విచారణ మధ్యలో ఉన్నందున నివేదికలు ఇప్పుడే బహిర్గతం చేయలేమన్నారు. అనంతరం  ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్‌ 21కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు