Nupur Sharma: నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: క్షమాపణలు కోరిన నూపుర్‌ శర్మ

5 Jun, 2022 18:50 IST|Sakshi

న్యూఢిల్లీ: మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సస్పెండ్‌ చేసిన అనంతరం తన వ్యాఖ్యలపై నూపుర్‌ శర్మ క్షమాపణలు కోరారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్ధేశం కాదని, తన వ్యాఖ్యలు ఎవరైనా బాధపడితే, బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు ట్విటర్‌ ద్వారా స్పందించారు. 

ఆమె తన వైఖరిని వివరిస్తూ ‘గత చాలా రోజులుగా మా మహాదేవ్‌ శివుడిని అవమానిస్తూ, అగౌరవపరుస్తుండటంతో నేను టీవీ చర్చలకు హాజరవుతున్నాను. జ్ఞానవాపి మసీదు వద్ద ఉంది లభించింది శివలింగం కాదు.. ఫౌంటెన్ అని ఎగతాళిగా చెబుతున్నారు. శివలింగాన్ని ఢిల్లీలోని రోడ్డు పక్కన ఉన్న గుర్తులు, స్తంభాలతో పోల్చడం ద్వారా కూడా వెక్కిరిస్తున్నారు. మా శివుడిని ఇలా నిరంతరంగా  అగౌరవపరచడాన్ని నేను సహించలేకపోయాను. దీనిపై  ప్రతిస్పందిస్తూ నేను కొన్ని విషయాలు చెప్పాను* అని నూపుర్ శర్మ చెప్పారు.
సంబంధిత వార్త: Nupur Sharma: వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్‌ శర్మను సస్పెండ్‌ చేసిన బీజేపీ

కాగా  హమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను ఆ పార్టీ ఆదివారం సస్పెండ్ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ నవీన్ కుమార్ జిందాల్‌ను కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలిగిస్తున్నట్లు వెల్లడించింది. సస్పెన్షన్‌ లెటర్‌లో ‘ పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావును మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నామని’ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది

మరిన్ని వార్తలు