మమతా దీదీకి బీజేపీ సవాల్‌!...దమ్ముంటే ఈ చట్టాన్ని ఆపండి!

27 Nov, 2022 16:09 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో బీజేపీ నాయకుడు సువేందు అధికారి రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలవుతోందని నొక్కి చెప్పారు. ఈ మేరకు ఆయన బంగ్లాదేశ్‌ మూలాలు ఉన్న మతువా ఆధిపత్య ప్రాంతమైన నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లాలోని ఠాకూర్‌ నగర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ....విస్వసనీయ పత్రాలతో కూడిన నివాసి అయితే వారికి పౌరసత్వం తీసివేయబడుతుందని సీఏఏ సూచించలేదు. తాము అనేకసార్లు సీఏఏ గురించి చర్చించాం. కచ్చితంగా రాష్ట్రంలో అములు చేయబడుతుంది. దీంతో అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుంచి వచ్చిన సిక్కు, బౌద్ధ, జైన్‌, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన వలసదారులకు పౌరసత్వం మంజూరు అయ్యేలా సీఏఏ సులభతరం చేస్తోంది.

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ....దీదీజీ మీకు దమ్ముంటే దీన్ని ఆపండి అంటూ సవాలు విసిరారు. ఐతే ఆ చట్టం కింద ఉన్న నిబంధనలను ప్రభుత్వం ఇంకా రూపొందించనందున ఇప్పటివరకు ఎవరికీ ఆ చట్టం ద్వారా పౌరసత్వం మంజూరు కాలేదు. కానీ నందిగ్రామ్‌ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి మతువా కమ్యూనిటీ సభ్యులకు కూడా పౌరసత్వం ఇవ్వబడుతుందని చెప్పారు. రాజకీయంగా ప్రాముఖ్యమున్న ఈ కమ్యూనిటీ బీజేపీ, తృణమాల్‌ శిభిరాలుగా చీలిపోయారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది మతువాలతో నాడియా, నార్త్‌, సౌత్‌24 పరగణాస్‌ జిల్లాలో కనీసం ఐదు లోక్‌సభ స్థానాల తోపాటు దాదాపు 50 అసెంబ్లీ స్థానాల్లో ఈ సంఘం ప్రభావం ఉంది.

అలాగే కేంద్ర మంత్రి బొంగావ్‌కు చెందిన బీజేపీ ఎంపీ శంతను ఠాకూర్‌ కూడా కచ్చితంగా సీఏఏ అమలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం సాధించేందకు కట్టుబడి ఉన్నాం అన్నారు. ఇదిలా ఉండగా, తృణమాల్‌ నాయకుడు పశ్చిమబెంగాల్‌ సీనియర్‌ మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ మాట్లాడుతూ...2023 పంచాయతీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ సీఏఏ కార్డుతో ఓటు బ్యాంకు రాజకీయాలపై ఫోకస్‌ పెట్టి ఇలా నాటకమాడుతోందని విమర్శించారు. ఐనా అలా ఎప్పటికీ జరగనివ్వం అని హకీమ్‌ దృఢంగా అన్నారు. 

(చదవండి: గుజరాత్‌ ఎన్నికల చిత్రం.. పటేళ్ల రూటు ఎటు?)

మరిన్ని వార్తలు